జీవన్ రెడ్డి ఎగ్జిట్ ఖాయమే
కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పేందుకే ఫిక్స్
మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి చర్చలు విఫలం
అధిష్టానం పెద్దల హామీలు వినిపించినా.. నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
రేపు అనుచరులతో కలిసి చర్చలు..
25న పబ్లిక్ అనౌన్స్మెంట్
బీఆర్ఎస్లో చేరేందుకు సన్నద్ధం..
ఏప్రిల్లో గ్రాండ్ జాయినింగ్కు ప్లాన్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో భారీ రాజకీయ షాక్ తప్పదనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీకి గుడ్బై చెప్పడం ఇప్పుడు దాదాపు ఖరారైన నిర్ణయంగా మారింది. గత కొన్ని రోజులుగా సాగుతున్న బుజ్జగింపుల ప్రయత్నాలు పూర్తిగా విఫలమవడంతో ఆయన ఎగ్జిట్ “ఫైనల్ స్టేజ్”కు చేరినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వలేదనే తీవ్ర అసంతృప్తితో జీవన్ రెడ్డి ఇప్పటికే మానసికంగా పార్టీ నుంచి దూరమయ్యారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు జరిగిన అన్ని చర్చలు ఫలితం ఇవ్వకపోవడం పరిస్థితి తీవ్రతను మరింత బహిర్గతం చేసింది. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నేతను నిలబెట్టుకోవడంలో పార్టీ విఫలమైందన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.
మంత్రుల దౌత్యం ఫెయిల్
జీవన్ రెడ్డిని పార్టీలోనే కొనసాగించేందుకు మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు జగిత్యాలలో నిర్వహించిన కీలక భేటీ పూర్తిగా విఫలమైంది. గంటకు పైగా సాగిన ఈ చర్చల్లో పార్టీ తరఫున పలు హామీలు ఇచ్చినా జీవన్ రెడ్డి వాటిని తిరస్కరించినట్లు తెలుస్తోంది. తన వర్గానికి జరిగిన అన్యాయం, కీలక నిర్ణయాల్లో పూర్తిగా పక్కనబెట్టడం, స్థానిక రాజకీయాల్లో తనకు సరైన ప్రాధాన్యం లేకపోవడం వంటి అంశాలను ఆయన నేరుగా ప్రస్తావించినట్లు సమాచారం. “దేవుడు శాసిస్తే మానవుడు అనుసరిస్తాడు” అన్న వ్యాఖ్యతోనే తన నిర్ణయం మారదని స్పష్టం చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు. కంట్రోల్ కోల్పోయిన అధిష్టానం జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర ఇంచార్జ్ వరకు వరుస చర్చలు జరిగినా ఒక్క అడుగు కూడా ముందుకు సాగకపోవడం కాంగ్రెస్ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. టికెట్ల కేటాయింపు నుంచి స్థానిక రాజకీయాల వరకు జీవన్ రెడ్డి వర్గాన్ని పూర్తిగా సైడ్ చేయడం ఈ సంక్షోభానికి దారితీసిన ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డి పార్టీతో మానసికంగా సంబంధాలు తెంచుకున్నారని, అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని ఆయన అత్యంత సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
రేపే డెసిషన్ డే
తాజా సమాచారం ప్రకారం జీవన్ రెడ్డి రేపు (ఆదివారం) తన కోర్ టీం, కీలక అనుచరులతో నిర్ణయాత్మక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ అనంతరం మీడియా ముందుకు వచ్చి తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక 25న జగిత్యాల టౌన్లోని బండారి గడ్డలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్కు అధికారికంగా గుడ్బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ వైపు అడుగులు జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పక్కా సమాచారం. ఏప్రిల్ 5 నుంచి 10 మధ్య భారీ జన సమీకరణతో గ్రాండ్ జాయినింగ్ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైందని తెలుస్తోంది. వేలాదిమంది అనుచరులతో శక్తి ప్రదర్శనకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం.


