ఘనంగా జన ఔషధి వార్షికోత్సవం
కాకతీయ, మేడ్చల్–మల్కాజిగిరి : తక్కువ ధరలకు నాణ్యమైన మందులు అందిస్తూ భారతీయ జన ఔషధి పథకం సాధారణ ప్రజలకు పెద్ద ఊరటగా మారిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నేరేడ్మెట్లో ఈ పథకం వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నేరేడ్మెట్ డివిజన్ ఆర్కేపురం ఆఫీసర్స్ కాలనీలో గీతా జ్ఞాన్ భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. నేరేడ్మెట్ మాజీ కార్పొరేటర్ కొతపల్లి మీనా ఉపేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలు అవుతున్న భారతీయ జన ఔషధి పథకం వల్ల ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. సాధారణ ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు, వృద్ధులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. వైద్య ఖర్చులు తగ్గించుకోవడంలో జన ఔషధి కేంద్రాలు కీలకంగా మారాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన జన ఔషధి కేంద్రాలను ప్రజలు ఎక్కువగా వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


