చౌక ధరలో జన ఔషధి
కేంద్ర మంత్రి బండి సంజయ్
ముకరంపురంలో జన ఔషధి కేంద్రం ప్రారంభం
కాకతీయ, కరీంనగర్/ముకరంపుర : రాష్ట్రంలో మెడిసిన్ ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలను వినియోగించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. కరీంనగర్ నగరంలోని ముకరంపుర డాక్టర్ స్ట్రీట్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. పేద ప్రజలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందుల ధరలు అధికంగా ఉండటంతో, వాటిని కొనుగోలు చేయడం చాలా మందికి కష్టంగా మారిందన్నారు. మందులు కొనలేక పేదలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసి, తక్కువ ధరలకు నాణ్యమైన జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ కేంద్రాలు ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకం కింద నిర్వహించబడుతున్నాయని చెప్పారు. బ్రాండెడ్ మందులతో పోలిస్తే తక్కువ ఖర్చుతో సమాన నాణ్యత కలిగిన మందులు అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మందుల అందుబాటు పెంచడం, ప్రజల్లో జనరిక్ మెడిసిన్ వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యమని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, జన ఔషధి కేంద్రాల ద్వారా చౌక ధరలో మెడిసిన్స్ పొందాలని మంత్రి కోరారు.


