కాకతీయ, నేషనల్ డెస్క్: ఆఫ్రికా దేశమైన కాంగోలో ఇస్లామిక్ స్టేట్ మద్దతు ఉన్న తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. కత్తులు, గొడ్డళ్లతో 52 మందిని నరికి అతికిరాతకంగా చంపేశారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు వెల్లడించారు. కాంగో దళాల చేతిలో ఓటమి పాలవ్వడంతో రగిలిపోయిన అలైట్ డెమోక్రటిక్ ఫోర్సెస్ సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అక్కడి అధికారి ఒకరు తెలిపారు. బెని, లుబెరో ప్రాంతాల్లోని పౌరులపై ఏడీఎఫ్ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడినట్లు చెప్పారు.
నిద్రిస్తున్న ప్రజలను లేపి తాళ్లతో చేతులు కట్టేసి కత్తులు, గొడ్డళ్లతో అతికిరాతకంగా నరికి చంపినట్లు తెలిపారు. మెలియా గ్రామంలోనే దాదాపు 30 మంది బలితీసుకున్నారు. 8 మంది మహిళలు, 2 చిన్నారులతో సహా మొత్తం 52 మందిని చంపినట్లు వివరించారు. ఇళ్లకు కూడా నిప్పంటించారని మ్రుతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల ఓ క్యాథలిక్ చర్చి ప్రాంగణంలో తిరుగుబాటుదారులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఇస్లామిక్ స్టేట్ తో ముడిపడి ఉన్న తిరుగుబాటు సంస్థ అయిన ఎడీఏఫ్ ఈ సంస్థ ఉగాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పౌరులే లక్ష్యంగా కొన్ని సంవత్సరాలుగా ఈ దాడులకు పాల్పడుతోంది. 2013 నుంచి ఇప్పటి వరకు దాదాపు 6వేల మందికిపైగా బలిగొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఏడిఎఫ్ పై అమెరికా, ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలు ఆంక్షలు విధించాయి.


