కల్పలత సూపర్బజార్లో అవకతవకలు
ఆకస్మిక తనిఖీలో బయటపడిన కుంభకోణం
రికార్డులు సీజ్ చేయాలని ఆదేశాలు
– ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి
కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా ది కో–ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ పరిధిలోని కల్పలత సూపర్బజార్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం కల్పలత సూపర్బజార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కార్యాలయానికి చేరుకున్న సమయంలో సిబ్బంది లేకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రిజిస్టర్లో ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు నమోదు ఉన్నప్పటికీ కేవలం ముగ్గురు మాత్రమే హాజరవడం, వారిలో ఇద్దరే విధుల్లో ఉండటంపై ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. జమా–ఖర్చు వివరాలు, రిజిస్టర్లు, ఇతర రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
బినామీల పేర్లతో జీతాలు
తనిఖీల్లో పలు అవకతవకలు వెలుగులోకి వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు. సభ్యత్వ నమోదులో ఆర్థిక అవకతవకలు జరిగాయని, సభ్యత్వ రుసుముల వినియోగానికి సంబంధించి సరైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. పాలకమండలి సభ్యులు గత మూడేళ్లుగా సొంత అవసరాలకు డీజిల్, పెట్రోల్ను వినియోగించుకున్నారని, ఇందుకు ఎలాంటి అనుమతులు లేకపోవడమే కాకుండా బిల్లులు కూడా చెల్లించలేదని వెల్లడించారు. కో–ఆపరేటివ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్లో 10 మంది సిబ్బంది పేర్లతో నెలకు రూ.10వేల చొప్పున జీతాలు తీసుకుంటున్నారని, అయితే రిజిస్టర్లలో వారి సంతకాలు లేవని తెలిపారు. బినామీ పేర్లతో జీతాలు చెల్లించినట్లు స్పష్టమవుతోందని ఎమ్మెల్యే మండిపడ్డారు.
కమిటీ రద్దు.. విచారణకు ఆదేశం
అవకతవకలపై వెంటనే సంబంధిత రికార్డులను సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్కు ఫోన్ ద్వారా సూచించారు. ఆదేశాల మేరకు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. కల్పలత సూపర్బజార్ కమిటీని తక్షణమే రద్దు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్, ఆర్డీఓలకు ఎమ్మెల్యే సూచించారు. తనిఖీల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చాలా రోజులుగా కల్పలత సూపర్బజార్లో అవకతవకలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని, అయితే తప్పు చేసిన వారిపై మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.



