బలప్రదర్శనకు ఇనుగాల ప్రయత్నాలు..!
అంతలోనే అధిష్ఠానం పెద్దల నుంచి ఫోన్లు
కొమ్మాల జాతరకు ర్యాలీగా వెళ్లాలని ముందుగా నిర్ణయం
500 టు వీలర్లు, 50 కార్లతో శక్తి ప్రదర్శనకు ప్లాన్
చివరి నిమిషంలో కార్యక్రమం రద్దు
అధిష్ఠానం పెద్దల నుంచే ఒత్తిడే కారణమంటూ ప్రచారం
నిరాశలో ఇనుగాల వర్గీయులు, అభిమానులు
గీసుగొండ రాజకీయాల్లో కొత్త సమీకరణాల చర్చ
కాకతీయ, గీసుగొండ : కొమ్మాల జాతర సందర్భంగా జరిగిన ప్రభ బండ్ల ప్రదర్శనలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు పరకాల రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. పరకాల నుంచే కొండా సుస్మిత పటేల్ రాజకీయ అరంగేట్రం ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలతో అధికార పార్టీలో వర్గపోరు మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పరకాల రాజకీయాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు మరియు కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, అలాగే కొండా వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎవరికి వారుగా తమ బలం చాటుకునేందుకు మూడు వర్గాలుగా విడిపోయి రాజకీయ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని స్థానిక నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొండా మురళి వ్యాఖ్యల తరువాత శనివారం ఇనుగాల వెంకట్రాంరెడ్డి వర్గీయులు బలప్రదర్శన చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి తమ బలాన్ని చూపించాలని ఆయన అనుచరులు ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో క్యాడర్ను అప్రమత్తం చేసిన ఇనుగాల ప్రధాన అనుచరులు గీసుగొండ నుంచి కొమ్మాల గుట్ట వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సుమారు 500 టు వీలర్లు, 50 కార్లతో ర్యాలీ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయం అధిష్ఠానం పెద్దల దృష్టికి వెళ్లడంతో పరిస్థితి మారినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ పెద్దల నుంచి ఫోన్లు రావడంతో పాటు ఓపిక పట్టాలని సూచనలు రావడంతో చివరి నిమిషంలో ర్యాలీని రద్దు చేసినట్లు ఇనుగాల అనుచరులు చెబుతున్నారు.

అభిమానుల్లో నిరాశ
చివరి నిమిషంలో ర్యాలీ రద్దు కావడంతో ఇనుగాల అభిమానులు తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. భారీ ర్యాలీ నిర్వహించాలని ఉత్సాహంగా సిద్ధమైన వర్గీయులు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ కార్యక్రమం రద్దు కావడం వారిలో అసంతృప్తికి దారితీసింది. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో అధిష్ఠానం సూచనల మేరకు తన స్థానాన్ని రేవూరి ప్రకాశ్ రెడ్డికి అవకాశం ఇచ్చామని, కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తగిన గుర్తింపు ఇవ్వడం లేదని కొందరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పరకాల రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడుతున్నాయనే చర్చ మొదలైంది. ముందు కొండా వర్గం, వెనుక ఇనుగాల వర్గం అనే విధంగా పరిస్థితులు మారుతున్నాయని రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఈ పరిణామాలతో గీసుగొండ మండలం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి గుదిబండగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవకాశం ఇచ్చిన నాయకుడికే సున్నం పెడుతున్నారంటూ కొందరు నాయకులు రేవూరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.


