మౌలిక వసతులే కార్పొరేటర్ల అజెండా కావాలి
ఫ్లెక్సీల అల్లకల్లోలాన్ని కట్టడి చేయాలి
అమృత్ నిధులతో తాగునీటి సమస్యకు పరిష్కారం
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
కాకతీయ, కొత్తగూడెం : మౌలిక వసతులు, పౌర సదుపాయాల కల్పనపై దృష్టి సారించి ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు కట్టుబడి పనిచేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా సూచించారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ సిపిఐ పక్ష కార్పొరేటర్ల సమావేశం మేయర్ మూడ్ గణేష్ అధ్యక్షతన సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరి భవన్లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సాబీర్ పాషా పలు సూచనలు చేశారు.
ఫ్లెక్సీలపై నియంత్రణ అవసరం
పట్టణంలో ప్రధాన రహదారులు, డివైడర్లు, విద్యుత్ స్తంభాలపై విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. వాటిని కట్టడి చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత పాలకవర్గం, అధికారులపై ఉందన్నారు. కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాలకు అమృత్ స్కీం కింద భారీ నిధులు మంజూరయ్యాయని, వాటితో వాటర్ ట్యాంకులు, పైపులైన్ల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు అధికార పక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూనే, ప్రజా సమస్యలపై ప్రతిపక్ష ధోరణితో గళం వినిపించాలని సూచించారు. కౌన్సిల్ సమావేశాల్లో సమస్యలను ప్రస్తావించి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ పక్ష కార్పొరేటర్లతో పాటు ముత్యాల విశ్వనాధం, వి. పూర్ణచందర్, మునిగడప వెంకటేశ్వర్లు, గడ్డం సతీష్ బాబు, దినేష్ తదితరులు పాల్గొన్నారు.


