కాకతీయ, నేషనల్ డెస్క్: భారత్, పాకిస్తాన్ మధ్య ఈ రోజు జరగనున్న ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్ రాజకీయంగా తీవ్ర దుమారాన్నే రేపుతోంది. ఇటీవల జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడటాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతోపాటు పలు విపక్ష పార్టీలు కూడా తీవ్రంగా తప్పుబట్టాయి. దేశ భద్రత, పౌరుల ప్రాణాల కంటే ప్రభుత్వానికి డబ్బే ముఖ్యమైందా అంటూ ప్రశ్నించారు.
ఈ అంశంపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పహల్గామ్ లో మన 26 మంది పౌరులను మతం అడిగి మరీ కాల్చి చంపిన పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడకూడదని చెప్పే దమ్ము మీకు లేదా అని అసోం, యూపీ సీఎంలను ఉద్దేశించి ఓవైసీ ప్రశ్నించారు. ఈ ఒక్క మ్యాచ్ ద్వారా బీసీసీఐకి వచ్చే రూ. 2వేల కోట్లు, రూ. 3వేల కోట్లు 26 మంది పౌరుల ప్రాణాల కంటే ఎక్కువైపోయాయా అంటూ నిలదీశారు. రక్తం నీరు కలిపి పారలేవని..ఉగ్రవాదం చర్చలు ఒకేసారి సాగవని గతంలో ప్రధాని చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ 26మంది పౌరుల కుటుంబాలకు తాము నిన్న, నేడు, రేపు కూడా అండగా నిలుస్తామని ఓవైసీ స్పష్టం చేశారు.
భారత్–పాక్ మ్యాచ్ చుట్టూ కేవలం క్రీడా ఉత్కంఠ మాత్రమే కాకుండా, రాజకీయ వేడెక్కింపూ కనిపిస్తోంది. ఈ పోరును వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు బహిరంగంగా డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ నేత అభిషేక్ దత్ మాట్లాడుతూ – “ఒకవైపు ప్రభుత్వం ఉగ్రవాదంతో చర్చలు జరపబోమంటూ హామీ ఇస్తుంది. అదే సమయంలో పాకిస్థాన్ జట్టుతో క్రికెట్ ఆడమని అనుమతి ఇవ్వడం ద్వంద్వ వైఖరి కాదా?” అని ప్రశ్నించారు. ఈ నిర్ణయం దేశానికి తప్పు సందేశాన్ని ఇస్తోందని ఆయన విమర్శించారు.
ఇక ఆమ్ ఆద్మీ పార్టీ మరింత ఘాటుగా నిరసన తెలిపింది. ఢిల్లీలో పాకిస్థాన్ ప్రతీక బొమ్మను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ – “మన కుటుంబాల ప్రాణాలను బలి తీసుకున్న వారితో మన ఆటగాళ్లను మైదానంలో నిలబెట్టడం ఎంత పెద్ద అన్యాయం!” అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, భారత్-పాక్ మ్యాచ్ను ప్రసారం చేసే క్లబ్బులు, రెస్టారెంట్లను బహిష్కరించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. మొత్తం మీద, ఆసియా కప్లోని ఈ పోరు కేవలం క్రికెట్ కాదని, ఇప్పుడు కేంద్రం – విపక్షాల మధ్య కొత్త రాజకీయ చర్చలకు వేదికగా మారిందని చెప్పవచ్చు.


