సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
రెండు సార్లు కప్ గెలిచిన మనోధైర్యం జట్టుకు బలం
ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలతో దూకుడుతో సూర్యసేన
పరిణితి చెందిన కెప్టెన్ సూర్యకుమార్ నాయకత్వం
జట్టుకు బలంగా బుమ్రా – వరుణ్ బౌలింగ్ బలం
లోయర్ ఆర్డర్ వరకు వేగంగా పరుగులు సాధించగలిగే బ్యాటింగ్ లైనప్
కీలక ఆటగాళ్లు ఫాంలోకి రావడంతో దుర్భేద్యంగా ఇండియా టీం
ఒత్తిడిని జయించడమే అసలు సిసలు పరీక్ష..!
వాంఖడే మైదానంలో రసవత్తర పోరు ఖాయం
కాకతీయ, స్పోర్ట్స్ : టీ -20 ప్రపంచకప్లో భారత జట్టు మరోసారి తనకెవరు సాటిలేరు అని నిరూపించుకుంది. ఒక్క ఓటమి.. నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో..సెమిస్ ఆశలు గల్లంతు అనే స్థితి నుంచి.. వరుస విజయాలతో సెమిస్కు చేరుకుని వాహ్ వ్ అనిపించింది. గ్రూప్ దశ నుంచే ఆధిపత్యం చాటిన భారత్, సూపర్ ఎనిమిది దశలోనూ సమతౌల్య ప్రదర్శనతో సెమీఫైనల్కు చేరుకుంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలు సాధించడం సాధారణ విషయం కాదు. జట్టు కూర్పు, స్పష్టమైన వ్యూహం, ఒత్తిడిని తట్టుకునే మనస్తత్వం ఈ విజయాల వెనుక ఉన్న అసలు కారణాలుగా చెప్పవచ్చు. గ్రూప్ దశలో పాకిస్థాన్పై అరవై ఒక పరుగుల తేడాతో ఘన విజయం సాధించి భారత్ టోర్నీ ఫేవరేట్ జట్టుగా పేరు నిలుపుకుంది. ఆ తర్వాత అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాలపై వరుస విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా నమీబియాపై పవర్ ప్లేలో ఎనభై ఆరు పరుగులు చేయడం జట్టు దూకుడుకు నిదర్శనం. ఓటమి లేకుండా సూపర్ ఎనిమిది దశకు చేరడం ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. సూపర్ ఎనిమిది దశలో జింబాబ్వేపై రెండువందల యాభై ఆరు పరుగులు చేసి భారీ స్కోరు నమోదు చేసింది. దక్షిణాఫ్రికా చేతిలో ఒకే ఒక్క ఓటమి ఎదురైనా, ఆ ఓటమి జట్టును మరింత అప్రమత్తం చేసింది. వెస్టిండీస్తో జరిగిన కీలక మ్యాచ్లో సంజూ శాంసన్ తొంభై ఏడు పరుగులతో నిలిచి మ్యాచ్ను ఒంటిచేత్తో గెలిపించాడు. అయితే సంజు అత్యుత్తమ ప్రదర్శన భారత అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది. ఆ ఇన్నింగ్స్ లేకపోతే సెమీస్ ప్రయాణం కష్టమయ్యేది.
సూర్యకుమార్ దూకుడు..!
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీలో జట్టుకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నాడు. ఏడు ఇన్నింగ్స్ల్లో రెండువందల ముప్పై ఒక పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. పరిస్థితిని అంచనా వేసి ఆట వేగాన్ని మార్చడం అతని ప్రత్యేకత. ఇషాన్ కిషన్ కూడా పాకిస్థాన్పై డెబ్బై ఏడు పరుగులతో మెరుపులు మెరిపించాడు. టోర్నీ మొత్తం 224 పరుగులు చేసి టాప్ ఆర్డర్లో స్థిరమైన ఆటను ప్రదర్శిస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు రన్రేటును కట్టడి చేస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి ఈ టోర్నీలో పన్నెండు వికెట్ల పడగొట్టి మిడిల్ ఓవర్లలో మ్యాచ్ను మలుపు తిప్పుతున్నాడు. ఆరుగురు బౌలింగ్ విభాగంలో ఉండటం జట్టుకు లాభిస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ వ్యూహాత్మకంగా బౌలింగ్లో మార్పులు చేర్పులు చేయడానికి ఇది ఎంతో దోహదం చేస్తోందనే చెప్పాలి.

బలాలు బాగున్నాయి… లోపాలు హెచ్చరిస్తున్నాయి…
భారతజట్టు బలం బ్యాటింగ్ లైనప్. టాపార్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు వేగంగా పరుగులు సాధించే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు ఉండటం జట్టుకు బలమని చెప్పాలి. పవర్ ప్లేలో దూకుడు, మధ్య ఓవర్లలో స్పిన్ కట్టుదిట్టం, చివర్లో మంచి పేస్ బౌలింగ్ ఇవన్నీ సమతౌల్యాన్ని ఇస్తున్నాయి. అయితే అభిషేక్ శర్మ వరుసగా మూడు సార్లు పరుగులేమీ సాధించకుండానే ఔట్ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొనే సమయంలో కొంత తడబాటు కనిపిస్తోంది. ఫీల్డింగ్లో చిన్న తప్పిదాలు కూడా మ్యాచ్ గమనాన్ని మార్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు సెమీస్లో ఇంగ్లాండ్తో తలపడనుంది భారత్. వాంఖడే మైదానం బ్యాటింగ్కు అనుకూలం. భారీ స్కోర్లు నమోదు చేసే అవకాశం ఉంది. గత రెండు సెమీస్ల్లో ఇరు జట్లు ఒక్కోసారి గెలిచాయి. ఈసారి పోరు సరిసమానంగా ఉండే సూచనలు ఉన్నాయి. భారత స్పిన్నర్లు ఇంగ్లాండ్ దూకుడు బ్యాటర్లను కట్టడి చేస్తే విజయావకాశాలు మెరుగవుతాయి. ప్రణాళిక ప్రకారం ఆడితే మరోసారి ఫైనల్ చేరే దిశగా అడుగులు వేయగలదు. అయితే సెమీస్ ఒత్తిడిని జయించడమే అసలు పరీక్ష.


