క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం పెంపు
విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఏకాగ్రత, నాయకత్వ లక్షణాలే లక్ష్యం
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
కాకతీయ, జనగామ : క్రీడల ద్వారా విద్యార్థుల్లో శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రత, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడమే ముఖ్య లక్ష్యమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో జనగామ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం 11వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి, డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం టార్చ్ రిలేను వెలిగించి క్రీడా పోటీలను అధికారికంగా ప్రారంభించారు. విద్యార్థుల మార్చ్పాస్ట్ వందనాన్ని స్వీకరించిన కలెక్టర్, రాష్ట్రవ్యాప్తంగా క్రీడా మీట్స్కు వచ్చిన విద్యార్థులను అభినందించారు.

జనగామ జిల్లాలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీల నిర్వహణ గర్వకారణమని పేర్కొన్నారు. క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని, అందరూ ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటాలని సూచించారు. ప్రిన్సిపాళ్లు, సిబ్బంది విద్యార్థులను సమర్థంగా చూసుకోవాలని, పీడీలు నిష్పక్షపాతంగా పోటీలను నిర్వహించాలని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే లక్ష్యంతో విద్యార్థులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గురుకులాల నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ ఆనంద్ వంటి ఆదర్శ వ్యక్తులను మార్గదర్శకులుగా తీసుకొని క్రీడల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జాయింట్ సెక్రటరీ బి. సక్రు నాయక్, డాక్టర్ బి. విక్రమ్, కే. జితేందర్ రెడ్డి ), జి. శంకర్ రెడ్డి , జనగామ, హెచ్. అరుణకుమారి (మల్టీజోన్–1 ఆఫీసర్), ఎస్. విద్యారాణి (జోనల్ ఆఫీసర్–5), పి. శ్రీనివాసరావు (ప్రిన్సిపల్), అలగోని నరసింహులు గౌడ్ (వైస్ ప్రిన్సిపల్), స్పోర్ట్స్ కోఆర్డినేటర్లు జి. శ్రీనివాస్ , డి. కిషన్ , వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, పీడీలు, పీఈటిలు పాల్గొన్నారు.



