ప్రమాణం చేసిన వెంటనే పనిలోకి
చెత్తపై యుద్ధం.. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం
సొంత ఖర్చులతో డ్రైనేజీల శుభ్రపరిచిన ప్రజా ప్రతినిధులు
34, 36 వార్డుల్లో కౌన్సిలర్ల సేవలకు ప్రజల ప్రశంసలు
వాట్సాప్ గ్రూపులతో సమస్యల పరిష్కారానికి కొత్త పంథా
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన నూతన వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే పనిలోకి దూకారు. తమ తమ వార్డుల్లో పారిశుద్ధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ చెత్త తొలగింపు, డ్రైనేజీల శుభ్రపరిచే కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో చురుకుగా వ్యవహరిస్తూ ప్రజా ప్రతినిధులుగా తమ బాధ్యతను నిరూపించుకుంటున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 36 వార్డులు ఉండగా, ముఖ్యంగా 34వ వార్డు కౌన్సిలర్ గుండా రాజశేఖర్, 36వ వార్డు కౌన్సిలర్ ముత్యం వెంకన్న పారిశుద్ధ్య పనుల్లో ముందుండి సేవలందిస్తున్నారు. గత మూడు రోజులుగా ఆయా వార్డుల్లో పేరుకుపోయిన చెత్త, డ్రైనేజీల్లో నిల్వ ఉన్న మురుగును సొంత ఖర్చులతో తొలగించి ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.

వెంటనే స్పందన.. ప్రజల్లో విశ్వాసం
వార్డుల్లో ఎక్కడ సమస్య వచ్చిన వెంటనే స్పందిస్తూ పరిష్కారం చూపుతున్నారు. వీధిలైట్లు, డ్రైనేజీలు, రహదారులపై ఉన్న చెత్త తొలగింపు వంటి అంశాల్లో స్వయంగా పర్యవేక్షణ చేపడుతున్నారు. ప్రజల సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని కోరుతూ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారు. గతంలో రెండు సార్లు గెలిచి మూడోసారి కూడా ప్రజల విశ్వాసం పొందిన గుండా రాజశేఖర్ అనుభవంతో సేవలందిస్తుండగా, తొలిసారి ఎన్నికైన ముత్యం వెంకన్న కూడా అదే స్థాయిలో చురుకుగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రజల సమస్యలను త్వరగా తెలుసుకోవడానికి కౌన్సిలర్లు తమ తమ వార్డులకు ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఈ గ్రూపుల ద్వారా ప్రజలు తెలియజేసే సమస్యలను వెంటనే గుర్తించి, సంబంధిత ప్రాంతాలకు వెళ్లి పరిష్కరిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజుల్లోనే ప్రజలకు సేవలు అందించడం ప్రారంభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా అన్ని వార్డు కౌన్సిలర్లు పనిచేస్తే మహబూబాబాద్ మున్సిపాలిటీ స్వచ్ఛ పట్టణంగా మారడం ఖాయమని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


