ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలి
అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టండి
నిబంధనల అమలులో ఎలాంటి సడలింపు లేదు
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశం
ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక రవాణాపై సమీక్ష సమావేశం
కాకతీయ, భూపాలపల్లి : ఇసుకను దుర్వినియోగం చేసినట్లయితే సంబంధితులపై తప్పనిసరిగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో ఎంపిడిఓలతో ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక రవాణా అంశంపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూపన్లలో అక్రమ సవరణలు చేసినా, ఇసుక అక్రమ రవాణా జరిగినా ఎంపిడిఓలు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన వారిపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పారదర్శకంగా ఇసుక సరఫరా
ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ఇసుక సరఫరా జరగాలని ఎమ్మెల్యే తెలిపారు. ఎక్కడైనా అక్రమాలు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకుని సంబంధిత నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్, ఎంపిడిఓలు తదితరులు పాల్గొన్నారు.


