కార్పొరేషన్లో అక్రమ వసూళ్ల దందా
సంఘ కార్యాలయ ఫ్యాన్ల పేరిట కార్మికుల నుంచి వసూళ్లు
రూ. 2000 చొప్పున బలవంతంగా చందాలు వసూలు
పారిశుద్ధ్య ఎస్ఐ సహకారంపై ఆరోపణలు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరపాలక సంస్థ లో ఓ కార్మిక సంఘ నాయకుడు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. పారిశుద్ధ్య జవాన్లు,కార్మికుల నుండి 2000 /- అక్రమంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తన సంఘ కార్యాలయంలో ఫ్యాన్ లు ఏర్పాటు చేయడం కోసం ఈ డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు కొంతమంది కార్మికులు వాపోతున్నారు. ఈ వసూళ్లకు స్వయంగా పారిశుద్ధ్య ఎసై సహకరించడం గమనార్హం.తానే నేరుగా నాయకుడికి డబ్బులు ఇవ్వాలని జవాన్లు, కార్మికుల నుండి వసూళ్లు చేసి ఇవ్వడంతో బాధితులు ఎవ్వరికీ చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
కార్మిక నాయకులకు కార్మికులు తమకు వచ్చిన కష్టాలను చెప్పుకుంటు సంఘ నాయకుల ద్వార వారి ఇబ్బందులు లను తొలగించుకుంటారు. కానీ ఖమ్మం నగరపాలక సంస్థ లో ఓ కార్మిక సంఘ నాయకుడు మాత్రం దీనికి విరుద్ధంగా వ్యవహరించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సంఘ కార్యాలయంలో లో ఫ్యాన్ లు కొనుగోలు కోసం కార్మికుల వద్ద నుండి బలవంతంగా వసూళ్లు చేయడం ఏంటని ఇతర సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.ఈ అక్రమ వసూళ్ల దందా లో శానిటరీ ఇన్స్పెక్టర్ పాత్ర కీలకంగా ఉండటం ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి సంఘ నాయకుడికి సహకరించడం ఏంటని తోటి ఉద్యోగులు సైతం ఎసై తీరును తప్పుపడుతున్నారు. మరి కొంతమంది కార్మికులు తాము అధికార పార్టీ యూనియన్ లో ఉన్నాము మేము 2000 రూ ఇవ్వలేము అన్నా కూడా బెదిరింపులతో చందాపుస్తకాలు నింపుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.


