రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు
మాజీ ఎంపీపీ జక్క అశోక్ యాదవ్ ఆగ్రహం…
కాకతీయ,చెన్నారావుపేట: చెన్నారావుపేట మండలంలో తనపై నమోదైన కేసులు పూర్తిగా రాజకీయ కక్షసాధింపులో భాగమేనని మాజీ ఎంపీపీ జక్క అశోక్ యాదవ్ తీవ్రంగా ఆరోపించారు. శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన, స్థానిక రాజకీయాల్లో ఆధిపత్యం కోసం కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి అనుచరుడిగా వ్యవహరిస్తున్న సూదిని అజయ్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం మండలంలో వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టు పనులపై తన పెత్తనం కొనసాగించేందుకు కుట్రపూరితంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. రెడ్డి సమాజానికి చెందిన కొందరు నాయకులను ముందుకు తెచ్చి, వారిని ప్రోత్సహించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
తనపై కేసులు నమోదు చేయించేందుకు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపిస్తూ, ఏసీపీ రవీందర్ రెడ్డి, ఎస్సై రాజేష్ రెడ్డి పాత్రపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు. నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు.
క్వార్టర్ గొడవ ను అడ్డుపెట్టుకుని కేసులు…
నెల రోజుల క్రితం జల్లి గ్రామంలో జరిగిన చిన్నపాటి గొడవను ఆధారంగా చేసుకుని తనను ఇరికించారని అశోక్ యాదవ్ తెలిపారు. సంఘటన జరిగిన రోజు, అలాగే విచారణ సమయంలో తాను గ్రామంలో లేనని స్పష్టం చేశారు. బాధితులు నిరసన తెలిపిన సమయంలో కూడా తాను మండల పరిధిలో లేనని చెప్పారు. సంబంధం లేని తనను కేసుల్లో చేర్చడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు.
సూదిని అజయ్ రెడ్డి అక్రమ ప్రయోజనాల కోసం ఎవరికైనా తప్పుడు ఆరోపణలు చేయగలడని, అవసరమైతే సొంత వారినే దూరం చేసుకునే స్థాయిలో వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. జల్లి గ్రామంలో భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా దానికి అజయ్ రెడ్డే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, తనపై నమోదైన అక్రమ కేసులను రద్దు చేయాలని ఆయన కోరారు.


