అర్ధరాత్రి అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం
విద్యారంగ సమస్యల పరిష్కారం కోరితే అక్రమ అరెస్టులా?
ప్రజాపాలనలో విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటు
విద్యార్థి ఉద్యమకారులను బేషరతుగా విడుదల చేయాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అజిత్
కాకతీయ, కొత్తగూడెం : అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని, ప్రజాపాలనలో ప్రజాస్వామ్యం కూనీ అవుతోందని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్ మండిపడ్డారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ‘చలో అసెంబ్లీ’ పిలుపునిచ్చిన నేపథ్యంలో, విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సగం పాలనా పూర్తిచేసుకుంటున్నప్పటికీ హామీలు ఆచరణకు నోచుకోవడం లేదని, ఫీజు రియంబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ బకాయిలు విడుదల చేయడం లేదని విమర్శించారు. సంక్షేమ హాస్టళ్ల డైట్, కాస్మోటిక్ చార్జీలు ఆరు నెలలకోసారి వస్తే విద్యార్థులు ఎలా చదువుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ప్రకటన తప్ప క్షేత్రస్థాయిలో పని జరగడం లేదని, శిథిలావస్థలో ఉన్న హాస్టళ్లకు సొంత భవనాలు ఏవని నిలదీశారు. కేవలం 40 కోట్లతో కాకతీయ యూనివర్సిటీ ఎలా ముందుకు సాగుతుందని, ప్రైవేట్ ఫీజుల నియంత్రణ చట్టం ఎక్కడ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని కేటాయించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని, రాష్ట్రంలో విద్య తెలిసిన మంత్రి లేరా అని దుయ్యబట్టారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, రేవంత్ రెడ్డి తీరుకు విద్యార్థులు భవిష్యత్తులో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని హెచ్చరించారు. తక్షణమే విద్యార్థి నాయకులను విడుదల చేసి, విద్యా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


