ఇల్లందకుంట హుండీ ఆదాయం రూ.20.39 లక్షలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కానుకలు
కాకతీయ, జమ్మికుంట/ఇల్లందకుంట : బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీ ద్వారా గణనీయమైన ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల నుంచి భారీగా కానుకలు అందినట్లు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఇల్లందకుంట గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మార్చి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు నిర్వహించిన హుండీ లెక్కింపులో మొత్తం రూ.20,39,551 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. భక్తులు సమర్పించిన కానుకల్లో భాగంగా 6 గ్రాముల మిశ్రమ బంగారం, 225 గ్రాముల మిశ్రమ వెండి లభించినట్లు పేర్కొన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని కరీంనగర్ డివిజన్ పరిశీలకుడు పి. సత్యనారాయణ పర్యవేక్షణలో నిర్వహించారు. అర్చకులు శేషం వంశీధరాచార్యులు, మడికొండ నవీన్ కుమార్ శర్మ పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి కందుల సుధాకర్ సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.


