తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది
మంత్రి సీతక్క ఘాటు హెచ్చరిక
కాకతీయ, ములుగు ప్రతినిధి: తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర మంత్రి సీతక్క, అలాంటి చర్యలను ఇకపై అసలు సహించబోమని స్పష్టం చేశారు. ములుగు జిల్లాలో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. ఘనంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకారంపండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా స్థాయిలో ఇలాంటి కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు హాజరుకావడం ఇదే తొలిసారి కావడంతో నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పార్టీ పదవులు పొందడం గొప్ప విషయం కాదని, ప్రజల కోసం పని చేస్తేనే గుర్తింపు వస్తుందని తెలిపారు. పని చేయని వారిని పార్టీ పక్కన పెడుతుందని హెచ్చరించారు. కష్టపడి పనిచేసిన నాయకులకే ఉన్నత పదవులు వస్తాయని, అందుకు ఉదాహరణగా మహేష్ గౌడ్ ఎదుగుదలను ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీతక్క ఆరోపించారు.

గత పదేళ్లలో తెలంగాణను తమ సొంత ఆస్తిగా భావించిన నాయకులు ఇప్పుడు అసత్య ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే సహించం. తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది అంటూ తీవ్ర హెచ్చరిక చేశారు. అవసరమైతే కోర్టులకు వెళ్లి పరువు నష్టం దావాలు వేస్తామని తెలిపారు. ఇప్పటికే కొంతమందిపై సైబర్ క్రైమ్ కేసులు కూడా నమోదు చేసినట్లు వెల్లడించారు. అంగన్వాడీ సిబ్బందికి ఫోన్ల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలను ఆమె ఖండించారు. కేంద్రం సూచించిన నిబంధనల ప్రకారం పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహించామని చెప్పారు. మొదట 14,000 రూపాయల కోట్ వచ్చినప్పటికీ దాన్ని రద్దు చేసి, చివరకు 11,650 రూపాయలకు ఫోన్లు కొనుగోలు చేశామని వివరించారు.
ఈ విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు లెక్కలు చెబుతున్నాయని అన్నారు. బస్సు ఉచిత ప్రయాణం, మహిళలకు రుణాలు, రైతులకు మద్దతు వంటి పథకాలు అమలు చేస్తున్నప్పటికీ వాటిపై దుష్ప్రచారం జరుగుతోందని ఆమె తెలిపారు. ప్రజలు సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలకు అసహనం పెరుగుతోందని విమర్శించారు. మేడారం ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులపై వచ్చిన విమర్శలను సీతక్క కొట్టిపారేశారు. గద్దెల వద్ద జరిగిన ప్రమాదాన్ని రాజకీయంగా వాడుకోవడం సరికాదని పేర్కొన్నారు. పనుల్లో లోపం ఉంటే సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తప్పుడు ప్రచారాన్ని గట్టిగా ఎదుర్కొని పార్టీ ప్రతిష్టను కాపాడాలని సీతక్క పిలుపునిచ్చారు. ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే వెంటనే స్పందించాలి, అవసరమైతే కేసులు పెట్టాలి అని సూచించారు.


