బీజేపీకి అవకాశం ఇస్తే రూ.500 కోట్ల నిధులు తీసుకొస్తా
హుజూరాబాద్ రూపురేఖలు మార్చడం నా బాధ్యత
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కాకతీయ, హుజూరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి రూ.500 కోట్ల కేంద్ర నిధులు తీసుకొస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.259 కోట్ల నిధులు విడుదల చేసిందని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తాను చొరవ తీసుకున్న కారణంగానే ఈ నిధులు విడుదలయ్యాయని పేర్కొన్నారు.రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప మరేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మాదిరిగా దొంగ హామీలు ఇవ్వడం తమకు చేతకాదని, మాట ఇచ్చామంటే తప్పకుండా నెరవేర్చే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు.హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే ఢిల్లీకి వెళ్లి వరదలా నిధులు తీసుకొచ్చి పట్టణం రూపురేఖలు మార్చుతానని హామీ ఇచ్చారు. ఎన్నికలైన వెంటనే హుజూరాబాద్లో మినీ స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభిస్తానని తెలిపారు. గతంలో కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూరాబాద్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హుజూరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసిందన్నారు. 14, 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.19.57 కోట్లు, స్వచ్ఛ భారత్ ద్వారా రూ.1.10 కోట్లు, అమృత్ ద్వారా రూ.16.25 కోట్లు, స్వనిధి ద్వారా 4,377 మందికి రూ.7.63 కోట్లు, యూఐడీఎఫ్ ద్వారా రూ.36 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. వీధిదీపాలు, రోడ్లు, డ్రైనేజీలు, స్మశానవాటికల నిర్మాణం అన్నీ కేంద్ర నిధులతోనే జరిగాయని తెలిపారు.
సీఎస్సార్, ఎంపీ లాడ్స్ నిధులతో ఆసుపత్రికి మెడికల్ ఎక్విప్మెంట్స్, కమ్యూనిటీ హాల్స్, బోర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదివే విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు ఇచ్చామని, టెన్త్ పరీక్ష ఫీజును తన జీతం నుంచే చెల్లించానని పేర్కొన్నారు.
బీజేపీకి మున్సిపల్ పీఠం అప్పగించిన వెంటనే అర్థాంతరంగా నిలిచిన మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తి చేయిస్తామని, నిరుపేదలకు ఇళ్ల మంజూరు, డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ, మురుగు కాలువలు, సీసీ రోడ్లు, వీధిదీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 100 పడకల ప్రభుత్వ దవాఖానాలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందేలా ప్రత్యేక చొరవ చూపుతామని తెలిపారు.
ఈ సభలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ఎన్నికల ఇన్చార్జ్ ఎర్రం మహేశ్తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.



