- వచ్చే వారం బహిరంగ ఈ వేలం
- సుమారు 100 ప్లాట్లను విక్రయించే ఛాన్స్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ హౌసింగ్ బోర్డు (THB) అక్టోబర్ 6వ తేదీ సోమవారం నుండి, చింతల్, నిజాంపేట, బాచుపల్లి, కెపిహెచ్బి, నాంపల్లి, రావిర్యాల వంటి ప్రాంతాలలో భూములు, ప్లాట్లు, ఫ్లాట్లను బహిరంగ ఈ-వేలం పద్ధతుల్లో విక్రయించనుంది. ఈ విక్రయాలు ఈనెల 6 నుంచి 20 వరకు కొనసాగుతాయి. సుమారు 100 ప్లాట్లను వేలం వేయాలని హౌసింగ్ బోర్డు యోచిస్తోంది.
ఎకరం రూ. 70 కోట్లు..
సోమవారం నగరంలోని చింతల్, నిజాంపేట, బాచుపల్లి ప్రాంతంలోని 22 రెసిడెన్షియల్ ప్లాట్స్, ఫ్లాట్స్ లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ గత నెల 15 తేదీన జారీ చేశారు. ఇటీవల కెపిహెచ్బి కాలనీ ప్రాంతంలో హౌసింగ్ బోర్డు పలు దఫాలుగా నిర్వహించిన భూముల విక్రయాల్లో ఎకరా భూమి సుమారు రూ. 70 కోట్లకు ఇ-వేలం ద్వారా విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెపిహెచ్ బి కాలనీలో నాలుగు కమర్షియల్ ప్లాట్లను అక్టోబర్ 7, 8 వ తేదీల్లో ఈ-వేలం ప్రక్రియ ద్వారా విక్రయించనున్నారు. ఫేజ్ 1, 2 పరిధిలోని 6549 చదరపు గజాలతోపాటు, 2420 చదరపు గజాలు, 2397 చదరపు గజాలు, 726చ. గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు మంగళవారం ఈ-వేలం నిర్వహించనున్నారు. అలాగే నాంపల్లి ప్రాంతంలోని 1148 చదరపు గజాల కమర్షియల్ ప్లాట్లను కూడా 8 వ తేదీన ఈ-వేలం ద్వారానే విక్రయిస్తున్నట్లుగా హౌసింగ్ బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.


