ఇళ్లను పేదలకు తక్షణమే ఇవ్వాలి
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
దూపకుంట ఇళ్లను పరిశీలించిన ఎంసిపిఐ(యు) బృందం
ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా
కాకతీయ, వరంగల్ సిటీ : కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు ఇప్పటికీ పంపిణీ చేయకపోవడం సిగ్గుచేటని, వెంటనే ఇళ్లను కేటాయించాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అర్హులైన పేదలకు తామే ఇండ్లు పంచుతామని హెచ్చరించారు. ఎంసిపిఐ(యు) వరంగల్ నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ జిల్లా, నగర నాయకులు దూపకుంట పరిధిలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించి నిర్మాణ స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిరుపేదల కోసం అన్ని సౌకర్యాలతో రెండు పడకల ఇండ్ల నిర్మాణం చేపట్టినా, వాటిని పంపిణీ చేయకుండా కాలయాపన చేయడం అన్యాయమన్నారు.
ఇళ్లు ఎందుకు పంపిణీ చేయరు..?
గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కొండ సురేఖ ప్రస్తుతం మంత్రిగా ఉన్నప్పటికీ దూపకుంటలో పూర్తయిన ఇండ్లను ఇప్పటికీ పేదలకు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వరంగల్ నగర పరిధిలో దూపకుంటలో సుమారు 2400 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, సగం మాత్రమే పూర్తై మిగతావి అసంపూర్తిగా ఉండి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని విమర్శించారు. అలాగే లక్ష్మీ టౌన్షిప్లో 210, తిమ్మాపూర్లో 456 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఉన్నప్పటికీ ఇప్పటివరకు పంపిణీ చేయకపోవడం సమంజసం కాదన్నారు. వెంటనే పూర్తయిన ఇండ్లను పేదలకు కేటాయించాలని, అసంపూర్తి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నాసిరకం నిర్మాణాలు, నిలిచిపోయిన పనులపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా
ఈనెల 20న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు వెంటనే ఇవ్వాలనే డిమాండ్తో ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేస్తామని ఎంసిపిఐ(యు) నగర కార్యదర్శి మాలోత్ సాగర్ ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర సహాయ కార్యదర్శి సుంచు జగదీశ్వర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ముక్కెర రామస్వామి, నగర నాయకులు ఎగ్గని మల్లికార్జున్, మాలోత్ ప్రత్యూష, మాలి ప్రభాకర్, అప్పనపురి నర్సయ్య, మహమ్మద్ మెహబూబ్ పాషా, పరిమళ గోవర్ధన్, రాజు, తాటికాయల రత్నం, చుక్క ప్రశాంత్, నలివెల రవి, రామస్వామి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.


