వైద్యశాలలో సిబ్బంది నిరసన
నాలుగు నెలల వేతనాలు విడుదల చేయాలని డిమాండ్
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం సామాజిక వైద్యశాలలో పనిచేస్తున్న ఎన్హెచ్ఎం సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, సపోర్టింగ్ స్టాఫ్, శానిటేషన్ వర్కర్లు నాలుగు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ కష్టంగా మారడంతో ఆదివారం ఆసుపత్రి ముందు నిరసన తెలిపారు. సిబ్బంది మాట్లాడుతూ వరుసగా నాలుగు నెలలుగా వేతనాలు అందక ఆర్థికంగా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నామని తెలిపారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయి జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రతినెల 1వ తేదీన జీతాలు జమ అయ్యేలా స్థిరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నిరసనలో గంగాధర్, భద్రయ్య, మురళి, వెంకట్, సుమలత, కౌసల్య, బతుకమ్మ, లక్ష్మణ్, మణి, నరేష్, సుధాకర్, శశి తదితరులు పాల్గొన్నారు.


