కాకతీయ, నేషనల్ డెస్క్: గుజరాత్ లో పరువు హత్య కలకలం రేపింది. బనస్ కాంతా జిల్లాలో పరువు హత్యకు గురైన 18ఏళ్ల యువతి చంద్రిక చౌదరి ఈ మధ్యే నిర్వహించిన నీట్ పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. భవిష్యత్తులో వైద్యురాలు కావాలన్న ఈ యువతిని ఆమె తండ్రి, ఇద్దరు బాబాయ్ లు కలిసి హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
నీట్ కోచింగ్ కోసం పాలన్ పూర్ లోని ఓ హాస్టల్ లో ఉన్న సమయంలో చంద్రిక, పెళ్లైన హరేశ్ చౌదరి అనే యువకుడితో ప్రేమలో పడి సహజీవనం చేస్తోంది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకువచ్చారు. అదే సమయంలో ఓ పాత కేసులో హరేశ్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
జూన్ 21న హరేశ్ జైలు నుంచి విడుదలయ్యాడు. చంద్రిక ఆచూకీ కోసం గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో జూన్ 27న విచారణకు రావాల్సి ఉంది. అయితే అంతకు ముందు 3 రోజుల ముందే జూన్ 24న చంద్రిక మరణించింది. మరుసటి రోజు ఉదయాన్నే కుటుంబ సభ్యులు హడావుడిగా ఆమె అంత్యక్రియలను పూర్తి చేశారు.
చంద్రికకు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి నిద్రలోకి జారుకున్న తర్వాత గొంతు నులిమి చంపారని ఏఎస్పీ వివరించారు. హరేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితులైన ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మూడో వ్యక్తి పరారీలో ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.


