భగత్నగర్లో అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు
డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో ఉత్సాహంగా వేడుకలు
కాకతీయ,కరీంనగర్ : భగత్నగర్లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ వేడుకల్లో డివిజన్ ప్రజలు భారీగా పాల్గొని ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా గడిపారు.ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా సునీల్ రావు కార్యాలయం ముందు హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. సంగీతం, నృత్యాలతో ప్రాంగణం కిక్కిరిసిపోయి పండుగ వాతావరణం నెలకొంది.


ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు మాట్లాడుతూ, హోలీ అనేది ఆనందం, ఐక్యతకు ప్రతీక. మన మధ్య ఉన్న విభేదాలను మరిచి అందరూ కలిసికట్టుగా జరుపుకునే పండుగ ఇది. రంగులు మన జీవితాల్లో సంతోషాన్ని, కొత్త ఆశలను నింపుతాయి. సమాజంలో సఖ్యత, సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు హోలీ వంటి పండుగలు ఎంతో అవసరం అని తెలిపారు.
అలాగే ప్రజలు హోలీ పండుగను సురక్షితంగా, బాధ్యతతో జరుపుకోవాలని, ఇతరులకు అసౌకర్యం కలగకుండా ఆనందాన్ని పంచుకోవాలని సూచించారు.


