వెలుగుమట్ల భూములపై హైకోర్టు స్టే
ఇళ్ల కూల్చివేతలపై కోర్టు ఆగ్రహం
ప్రభుత్వ చర్యలపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం
బాధితులందరికీ న్యాయం చేయాలని ఆదేశాలు
కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు స్పష్టమైన దిశానిర్దేశం
కేవలం 311 మందికే కాదు… అందరికీ ఇళ్లు ఇవ్వాలని స్పష్టం
అసలైన లబ్ధిదారుల గుర్తింపుపై పారదర్శకత అవసరం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత కొంతకాలంగా కొనసాగుతున్న ఈ వ్యవహారంలో బాధితులకు ఊరటనిస్తూ, ప్రభుత్వ చర్యలపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముఖ్యంగా భూములపై యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు స్పష్టంగా ఆదేశించింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు స్పష్టమైన దిశానిర్దేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎలాంటి మార్పులు చేయకుండా అలాగే కొనసాగించాలని పేర్కొంది. ప్రభుత్వం గుర్తించిన కొద్ది మంది లబ్ధిదారులకు మాత్రమే పరిమితం కాకుండా, అక్కడ ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్క అర్హుడికి న్యాయం చేయాలని కోర్టు స్పష్టం చేసింది. కేవలం ఎంపిక చేసిన 311 మందికే ఇళ్లు ఇవ్వడం సరిపోదని, అసలైన బాధితులందరికీ ఇళ్లు, స్థలాలు కేటాయించాలని ఆదేశించింది. ఇది ఈ కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు లబ్ధిదారుల ఎంపికపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పారదర్శకతపై దృష్టి
భూదాన్ భూముల్లో అసలైన లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించాలని కోర్టు స్పష్టం చేసింది. ఎవరికి నిజంగా నష్టం జరిగిందో గుర్తించి, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించింది. బాధితులు కోర్టును ఆశ్రయించడంతో ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు, వారి వాదనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో వెలుగుమట్లలో అధికారులు ఆక్రమణల తొలగింపు పేరుతో వందలాది ఇళ్లను కూల్చివేయడం పెద్ద వివాదంగా మారింది. అప్పట్లో ప్రభుత్వం ఈ చర్యలను సమర్థించుకున్నప్పటికీ, కోర్టు ఆదేశాలను పాటించలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు ఆ ఘటనపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వ చర్యలు సరైన విధంగా జరిగాయా అన్న అంశంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తానికి వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలపై అందరి దృష్టి నిలిచింది. బాధితులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారా… లేక మళ్లీ వివాదం ముదురుతుందా అన్నది చూడాల్సి ఉంది.


