కరీంనగర్లో హైఅలర్ట్
మేయర్, చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో భారీ బందోబస్తు
పలుచోట్ల నిషేధాజ్ఞలు అమలు
సహకరించాలని కోరిన పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
కాకతీయ, కరీంనగర్ : మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్తోపాటు మున్సిపాలిటీల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల పరోక్ష ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు సమగ్ర భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. మున్సిపల్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగే కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగింది. కార్యాలయాల సమీపంలో గుమిగూడటంపై పూర్తి నిషేధం విధించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం బి.ఎన్.ఎస్.ఎస్ సెక్షన్ 163 (పూర్వపు సెక్షన్ 144) కింద నిషేధాజ్ఞలు అమలులోకి తీసుకువచ్చారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడరాదని సీపీ స్పష్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లే మార్గాల్లో అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.



