కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఉత్తర-వాయువ్య దిశలో కదులుతున్న వాయుగుండం శుక్రవారం (ఇవాళ) దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర కోస్తా తీరాన్ని దాటింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ వాయుగుండం ప్రభావం వల్ల తెలంగాణలో వర్షాల ప్రభావం ఉండనున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, జనగామ, వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని పేర్కొంది.
ఈ వాయుగుండం గోపాల్పూర్ సమీపంలోని ఉత్తర కోస్తా తీరాన్ని దాటిన తర్వాత క్రమంగా ఉత్తర వాయువ్య దిశలో కదులుతూ బలహీనపడుతోంది. వర్షాలు ఈ ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టినప్పటికీ, శనివారం (రేపు) కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు, ఒకటి-రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


