వివేక్ కడుపు మంట ఇప్పటికైనా తగ్గిందా?
జైలులో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు
బయటకు రాకుండా అనేక కుట్రలు చేశారు
నా కొడుకు బర్త్ డే నాడు ఇంట్లో లేకుండా చేశారు
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
కాకతీయ, రామకృష్ణాపూర్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సహా బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన కేసులో జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరుచేయడంతో ఆయన బయటకొచ్చారు. బాల్క సుమన్తో పాటు రాజారెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్ బెయిల్పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీసుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ను ఎలా పంపించారని అడిగితే పోలీసులు తమపై లాఠీ చార్జి చేశారని పేర్కొన్నారు. వాళ్లు దాడి చేస్తే.. మాపైనే రివర్స్లో కేసు పెట్టారని మండిపడ్డారు. ఈ ఘటనలో 22 మందిపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలిచిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ పీఠం ఎలా వస్తుందని మండిపడ్డారు. ప్రజా తీర్పును మంత్రి వివేక్ గౌరవించడం లేదని విమర్శించారు. జిల్లాలోని కలెక్టర్ నుంచి తహశీల్దార్ వరకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగుల్లా కాకుండా విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో వికృత క్రీడ ప్రారంభించారని బాల్క సుమన్ అన్నారు. జైలు లోపల కూడా తమను ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. నిన్న హోలీ, ఇవాళ నా కొడుకు పుట్టిన రోజు.. ఈ టైమ్లో నన్ను ఇంట్లో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ కక్ష సాధింపు చర్యలకు దిగలేదని తెలిపారు. అందర్నీ కలుపుకుపోయాం తప్ప.. కక్ష సాధింపు చేయలేదని స్పష్టం చేశారు. నన్ను జైలులో పెట్టారు కదా.. ఇప్పుడు కడుపు మంట తగ్గిందని అనుకుంటున్నా అని అన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఇప్పటికైనా సవ్యంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.


