108 అంబులెన్స్లో సుఖప్రసవం.. తల్లీబిడ్డలు క్షేమం
– తల్లికి ప్లేట్లెట్స్ తక్కువగా ఉండటంతో సిద్దిపేటకు రిఫర్
– మార్గమధ్యంలోనే డెలివరీ నిర్వహించిన సిబ్బంది
– తక్షణ స్పందనతో ప్రాణాలు కాపాడిన ఈఎంటీ పైలట్
– అనంతరం గజ్వేల్ ఎంసిహెచ్కు తరలింపు.. తల్లి బిడ్డలు క్షేమం
– ఈఎంటీ రాజు, పైలట్ భానుప్రసాద్
కాకతీయ, గజ్వేల్ : అత్యవసర సమయంలో వేగంగా స్పందించి తల్లి శిశువును కాపాడడం మా బాధ్యత అని 108 అంబులెన్స్ ఈఎంటీ రాజు తెలిపారు. సిద్దిపేట జిల్లా బూరుపల్లి గ్రామానికి చెందిన గర్భిణి మహిళ కల్పన (27) కు ప్రసవ వేదనలు రావడంతో కుటుంబ సభ్యులు గజ్వేల్ ఎంసిహెచ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించగా ప్లేట్లెట్స్ తక్కువగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. వెంటనే 108 అంబులెన్స్ ను సంప్రదించగా కుకునూరుపల్లి అంబులెన్స్ సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను సిద్దిపేటకు తరలిస్తున్న సమయంలో మహిళకు నొప్పులు అకస్మాత్తుగా తీవ్రమవడంతో మార్గమధ్యంలోనే ప్రసవం నిర్వహించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఏమాత్రం తడబడకుండా ఈఎంటీ రాజు పైలట్ భానుప్రసాద్ సమన్వయంతో అంబులెన్స్లోనే అత్యంత నైపుణ్యంతో సురక్షితంగా డెలివరీ నిర్వహించారు. కల్పన భర్త భరత్ కు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సిబ్బంది సమయస్ఫూర్తి వల్ల తల్లీబిడ్డలిద్దరి ప్రాణాలు కాపాడటం సాధ్యమైందని వైద్యులు పేర్కొన్నారు. అనంతరం తల్లి శిశువును గజ్వేల్ ఎంసిహెచ్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్య సిబ్బంది తెలిపారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి సేవా నిబద్ధతకు స్థానిక ప్రజలు ప్రశంసలు తెలిపారు.


