మేడారంలో వడగళ్ల వాన బీభత్సం
పంటలను నాశనం చేసిన అకాల వర్షం
రైతులకు భారీ నష్టం.. విద్యుత్ సరఫరాకు అంతరాయం
కాకతీయ, ములుగు ప్రతినిధి : అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వర్షంతో పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో గురువారం ఎండ తీవ్రత మధ్య ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కురిసి బీభత్సం సృష్టించింది. ఈ వర్షంతో మేడారం గ్రామంలో ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ సౌకర్యం లేక ఇళ్లు నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా వరి, మిరప పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోత దశలో ఉన్న వరి పంట నేలకూలిపోగా, మిరప తోటలు వడగళ్ల దెబ్బకు పూర్తిగా చెదిరిపోయాయి. కొన్నిచోట్ల పంటలు నేలమట్టమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్పై పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా చెదిరిపోయాయని వారు పేర్కొన్నారు. వడగళ్ల వర్షంతో పాటు వచ్చిన బలమైన గాలులు చెట్లు, విద్యుత్ స్తంభాలను కూడా కూల్చివేశాయి. దీంతో మేడారం మరియు పరిసర గ్రామాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం కలిగింది. పరిస్థితిని సమీక్షించి రైతులకు తక్షణ సాయం అందించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.



