నైపుణ్యాలు, నైతికతతోనే గొప్ప వైద్యులు
వైద్య విద్యార్థులకు ‘ప్రాణా–2026’ మార్గదర్శకం
పరిశోధన, నాయకత్వంపై దృష్టి
డా. వి. రాజలింగం అదనపు వైద్య విద్యా సంచాలకులు
కాకతీయ, కరీంనగర్ : వైద్య వృత్తిలో నైపుణ్యాలు, నైతిక విలువలు కలిగినవారే గొప్ప వైద్యులుగా ఎదుగుతారని అదనపు వైద్య విద్యా సంచాలకులు డా. వి. రాజలింగం తెలిపారు.
ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “ప్రాణా–2026” వైద్య విద్యార్థుల సదస్సును శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్య విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
పరిశోధనపై ప్రాధాన్యం
వైద్య విద్యలో నాయకత్వ లక్షణాలు, పరిశోధనల ప్రాముఖ్యత పెరుగుతోందన్నారు. కేవలం చికిత్సకు పరిమితం కాకుండా పరిశోధకులుగా ఎదగాలని సూచించారు. ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
నైతిక విలువల ప్రాధాన్యం
సాంకేతికత వినియోగం, సంభాషణ నైపుణ్యాలు, రోగి కేంద్రిత దృక్పథం ముఖ్యమని తెలిపారు. వృత్తి నైతికత, నిజాయితీ, పారదర్శకతను పాటించాలని సూచించారు. మంచి వైద్యుడు వ్యాధిని మాత్రమే చూస్తాడని, గొప్ప వైద్యుడు రోగిని పూర్తిగా అర్థం చేసుకుంటాడని పేర్కొన్నారు.
ఈ సదస్సులో డైరెక్టర్లు డా. బోయినిపల్లి హారిణి, డా. బోయినిపల్లి హసిని, ప్రిన్సిపాల్ డా. పి.ఎల్. జాన్ ఇస్రాయెల్, సీఈఓ రామచందర్ రావు, డా. సి.ఎన్. ప్రసాద్, డా. కిషన్ రెడ్డి, ప్రసాద్ రావు, విభాగాధిపతులు, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.


