దూసుకుపోతున్న గ్రానైట్ లారీలు
భయ ఆందోళనల్లో చెందుతున్న ప్రజలు
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు
కాకతీయ ,చిగురుమామిడి : నియమ నిబంధనలు పక్కన పెట్టి గ్రానైట్ లారీలు అధిక వేగంతో దూసుకుపోతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు రాత్రి వేళల్లో లారీల రాకపోకలు తీవ్రంగా పెరిగాయి. ముల్కనూర్ గ్రామాల మధ్యుగా వెళ్లే రహదారిపై భారీ వాహనాలు అదుపు లేకుండా సంచరిస్తున్నాయి. దీంతో రాత్రి సమయంలో ఈ మార్గంలో ప్రయాణించడం ప్రమాదకరంగా మారింది. భారీ వాహనాల నిరంతర రాకపోకలతో రోడ్లు దెబ్బతింటున్నాయి. ఎప్పుడైనా ప్రమాదం సంభవించే పరిస్థితి నెలకొంది. విద్యార్థులు, రైతులు, అత్యవసర అవసరాల కోసం వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. లారీ యజమానులు అడ్డూ అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు, రవాణా శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని రాత్రి వేళల్లో లారీల రాకపోకలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదాలు తప్పవని ప్రజలు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని వెంటనే నియంత్రించాలని కోరుతున్నారు.


