కామేపల్లిలో ఘనంగా రంజాన్ తోఫా పంపిణీ
పేద ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వ కానుకలు
మసీదుల్లో కొనసాగిన పంపిణీ కార్యక్రమం
కాకతీయ, కామేపల్లి : రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం అందజేస్తున్న రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం కామేపల్లి మండలంలో బుధవారం ఘనంగా జరిగింది. నిరుపేద ముస్లిం కుటుంబాలకు పండుగ కానుకగా ఈ కిట్లను కాంగ్రెస్ నాయకులు అందజేశారు. మండలంలోని పాతలింగాల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ సభ్యులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు కిట్లను పంపిణీ చేశారు. ముస్లిం సోదరులు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సహాయం అందిస్తోందని ఆయన తెలిపారు. అనంతరం మండల వ్యాప్తంగా ఉన్న తొమ్మిది మసీదుల్లో ముస్లిం మైనారిటీ సంఘం అధ్యక్షుడు సయ్యద్ ఇమామ్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం కొనసాగింది. ప్రతి మసీదు వద్ద ముస్లిం పెద్దలు, లబ్ధిదారుల సమక్షంలో కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంరెడ్డి జగన్నాథ్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు, మైనారిటీ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ తోఫా పట్ల ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేశారు.


