- జిల్లా కలెక్టర్ రాజార్షి షా
కాకతీయ ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని బాలరక్షక్ భవన్లో మంగళవారం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో “పాలన పథకం”పై ఐసీడీఎస్ సిబ్బందికి ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలన పథకం లక్ష్యాలు, అమలు విధానం, డేటా సేకరణ పద్ధతులు, మొబైల్ అప్లికేషన్ వినియోగం తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. రాష్ట్ర లీడ్ రాజారామ్ ప్రసాద్, ప్రోగ్రామ్ అధికారి మాణికప్ప ప్రధాన శిక్షణదారులుగా పాల్గొన్నారు. అనంతరం వారు రిక్షా కాలనీ, సంజయ్ నగర్, మహాలక్ష్మి వాడ అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, కేంద్రాల పనితీరును పరిశీలించారు. అనంతరం అధికారులు జిల్లా కలెక్టర్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పాలన పథకం అమలు పురోగతిని కలెక్టర్కు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాలన పథకం అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని, పిల్లలు, గర్భిణీలకు శారీరక, మానసిక అభివృద్ధికి సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. క్షేత్ర స్థాయి సిబ్బంది సమగ్రంగా పనిచేస్తే గ్రామస్థాయిలో సానుకూల మార్పులు కనిపిస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి మిల్క, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్, సీడీపీఓలు సౌందర్య, శారద, ఉమాదేవి, నర్సమ్మ, వినూత్న, డీఎంసీ యశోద, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


