బీఆర్ఎస్కు గుడ్బై
బీఎస్పీలో చేరిన అంబాల ప్రభాకర్
కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బహుజన సమాజ్ పార్టీలో (బీఎస్పీ) చేరారు. ఆయనతో పాటు సుమారు 50 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కవులు, కళాకారులు, అభిమానులు కూడా బీఎస్పీలో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన డప్పు కళతో గజ్జగట్టి వేలాది మందిని చైతన్యపరిచిన ప్రభాకర్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్రావు సమక్షంలో ప్రగతి భవన్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆపార్టీని వీడినట్లు తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో బీఎస్పీ కండువా కప్పి అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ ప్రయోజనాలు పొందిన ప్రతి ఒక్కరూ బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలని సూచించారు. డాక్టర్ అంబాల ప్రభాకర్ పార్టీలో చేరడాన్ని పార్టీ నాయకులు అభినందించారు. కార్యక్రమంలో బీఎస్పీ జోనల్ కోఆర్డినేటర్ దొడ్డి సమ్మయ్య, జిల్లా ఇంచార్జి దొడ్డే శ్రీనివాస్, అసెంబ్లీ ఇంచార్జి వేల్పుల మల్లేష్, మాజీ కోఆర్డినేటర్ మారపల్లి మొగిలయ్య, మంద సమ్మయ్య, మారపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


