కాకతీయ, తెలంగాణ బ్యూరో: దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. వారికి బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34శాతం కార్మికులకు పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ వివరాలను వెల్లడించారు.
ఒక్కో కార్మికుడికి బోనస్ గా రూ. 1,95,610 ఇవ్వున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ చెల్లిస్తామని భట్టి తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారని చెప్పారు.
సింగరేణి సంస్థలోని 41వేల మంది శాశ్వత ఉద్యోగులకు మొత్తంగా రూ. 819కోట్లు బోనస్ గా పంపిణీ చేస్తామన్నారు. 30వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకూ రూ. 5,500 చొప్పున అందిస్తామన్నారు. కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ ను దీపావళికి పంపిణీ చేస్తామన్నారు.
భవిష్యత్తులోనూ సింగరేణి కార్మికులకు అండగా నిలుస్తామన్నారు. జీఎస్టీ మార్పుల వల్ల రాష్ట్రాలు ఆదాయాలు కోల్పోతున్నాయన్నారు. కోల్పోతున్న ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేయాలన్నారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రాష్ట్రాలపై భారం వేయడం సరికాదన్నారు. వచ్చే ఐదేళ్లపాటు కేంద్రం వయబులిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.


