కాకతీయ, తెలంగాణ బ్యూరో : గోదావరి పుష్కరాలను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా, దక్షిణ భారత కుంభమేళా స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2027 జూలై 23 నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బాసర నుంచి భద్రాచలం వరకు ధర్మపురి, కాళేశ్వరం వంటి ఆలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండేందున, ముందుగా వీటిని అభివృద్ధి చేయాలని సూచించారు. ఆలయాల అభివృద్ధితో పాటు శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
శాశ్వత మౌలిక వసతులు..
మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవహించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల తీరం ఉండగా, దాదాపు 74 ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఒకేసారి రెండు లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు, వాహనాల పార్కింగ్, తాగునీరు, వసతి, ట్రాఫిక్ నియంత్రణ, ఘాట్ల నిర్మాణం వంటి మౌలిక వసతులు శాశ్వత ప్రాతిపదికన కల్పించాలని సీఎం ఆదేశించారు.
గతంలో మహా కుంభమేళా, పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి వంటి విస్తృత అనుభవం కలిగిన కన్సల్టెన్సీలను నియమించుకోవాలని సీఎం సూచించారు. గోదావరి తీరం వెంట ఉన్న ప్రతి ఆలయాన్ని సందర్శించి విడివిడిగా ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక డిజైన్లు రూపకల్పన చేయాలని ఆదేశించారు.
కేంద్ర పథకాల వినియోగం
గోదావరి పుష్కరాల కోసం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలన్నింటినీ సమన్వయంతో ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్తో పాటు మరిన్ని పథకాల సహకారంతో పనులు చేపట్టాలని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు.
పుష్కరాల విజయవంతమైన నిర్వహణకు పర్యాటక, నీటి పారుదల, దేవాదాయ శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.


