తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు
కాజీపేట మండలం భట్టుపల్లిలో ప్రమాదం
ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అందజేసి ఆదుకోవాలి
: మోకుదెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అనంతుల రమేష్ గౌడ్
కాకతీయ, హన్మకొండ : హనుమకొండ జిల్లా కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామంలో తాటి చెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడు తీవ్రంగా గాయపడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. భట్టుపల్లికి చెందిన పూజారి రవి తాటి గీత వృత్తి చేస్తూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం ఉదయం అమ్మవారిపేటలోని తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో రవికి రెండు కాళ్లు రెండు చోట్ల విరగడంతో పాటు కాలు ఎముకలు బయటికి వచ్చి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన రవిని హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన రవికి రెండు కాళ్లు పూర్తిగా విరగడంతో అతడి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అనంతుల రమేష్ గౌడ్ ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. గీత కార్మికుడైన రవికి ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా మంజూరు చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాదానికి గురైన కార్మికుడికి అన్ని విధాలా అండగా నిలవాలని, గీత కార్మికులకు రక్షణ చర్యలు మరింత బలోపేతం చేయాలని రమేష్ గౌడ్ కోరారు. ప్రమాదాల నివారణకు తాటి చెట్ల ఎక్కే సమయంలో భద్రతా పరికరాలు తప్పనిసరిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు పూజారి రఘు గౌడ్తో పాటు కుటుంబ సభ్యులు విలాసాగరం రాజు గౌడ్, పూజారి నిఖిల్ గౌడ్, అఖిల్ గౌడ్, భార్య కోమల తదితరులు పాల్గొన్నారు.


