హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్
కమర్షియల్ సిలిండర్లపై కంపెనీల నియంత్రణ
ఆస్పత్రులు, హాస్టళ్లకు మాత్రమే ప్రాధాన్యత
గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు
తక్షణం అమలు చేయాలని కంపెనీల ఆదేశాలు
ఈకేవైసీ తప్పనిసరి చేసిన గ్యాస్ కంపెనీలు
సిలిండర్ బుకింగ్ వ్యవధిని 25 రోజులకు పెంపు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : దేశంలో గ్యాస్ సరఫరాపై పెట్రోలియం కంపెనీలు కొత్త నియంత్రణలు అమలు చేస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పరిమితం చేస్తూ హోటళ్లకు సరఫరా నిలిపివేయాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న గ్యాస్ నిల్వలను అత్యవసర అవసరాలకే వినియోగించాలని కంపెనీలు నిర్ణయించాయి. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్ నిల్వలను జాగ్రత్తగా వినియోగించేందుకు కొత్త మార్గదర్శకాలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్లను ఆస్పత్రులు, హాస్టళ్లకు మాత్రమే సరఫరా చేయాలని డీలర్లకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లకు తాత్కాలికంగా సరఫరా నిలిపివేయాలని సూచించినట్లు సమాచారం.
గృహ వినియోగదారులకు ప్రాధాన్యం
ఈ నిర్ణయం వల్ల గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. గ్యాస్ వినియోగం సక్రమంగా ఉండేందుకు కొన్ని నియంత్రణలు కూడా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత మరో సిలిండర్ బుక్ చేసుకునే వ్యవధిని పెంచారు. గతంలో 21 రోజులు ఉండగా ఇప్పుడు 25 రోజులకు పెంచినట్లు అధికారులు తెలిపారు. గ్యాస్ వినియోగదారులు తమ ఆధార్ వివరాలతో ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి చేశారు. ఈకేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ బుకింగ్ సదుపాయాన్ని నిలిపివేయనున్నట్లు హెచ్చరించారు. అక్రమంగా గ్యాస్ నిల్వలు చేయకుండా నిరోధించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. వినియోగదారులు వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని గ్యాస్ కంపెనీలు సూచిస్తున్నాయి.


