భూదాన్ పేరిట కోట్లు దోచిన ముఠా
కమిటీ సభ్యులమంటూ నిరుపేదల నుంచి రూ.3 కోట్లు వసూళ్లు
నకిలీ పట్టాలు, అక్రమ కేటాయింపులు బట్టబయలు
వెలుగుమట్ల భూ వివాదంపై ఇప్పటికే 19 కేసులు
ఇప్పటివరకు 9 మంది అరెస్ట్… కొనసాగుతున్న దర్యాప్తు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : భూదాన్ భూముల్లో ఇంటి స్థలాలు ఇప్పిస్తామని చెప్పి నిరుపేదలను మోసం చేసిన ముఠా వ్యవహారం ఖమ్మంలో వెలుగుచూసింది. యూసిసీఆర్ఎల్ (యంఎల్) ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమని తప్పుడు ప్రచారం చేస్తూ వెలుగుమట్ల ప్రాంతానికి చెందిన నిరుపేదల నుంచి సుమారు 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు 19 కేసులు నమోదు చేసి 9 మందిని అరెస్ట్ చేసినట్లు అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాదరావు తెలిపారు. భూదాన్ యజ్ఞ బోర్డు స్టాండింగ్ కౌన్సిల్ నిర్వహించిన సమగ్ర విచారణలో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు జరిగినట్లు తేలిందని ఆయన చెప్పారు. నిందితులు ఒక ముఠాగా ఏర్పడి తమను ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమని ప్రచారం చేసి అమాయక ప్రజలను నమ్మబలికినట్లు పేర్కొన్నారు.
ఒక్కొక్కరి నుంచి భారీ వసూళ్లు
భూదాన్ భూముల్లో ఇంటి స్థలాలు ఇప్పిస్తామని చెప్పి పేద ప్రజలను ప్రలోభపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఒక్కొక్కరి నుంచి 50 వేల నుంచి 1 లక్ష రూపాయల వరకు వసూలు చేసినట్లు వెల్లడించారు. ఈ విధంగా అనేక మంది నిరుపేదలు మోసపోయారని చెప్పారు. వసూలు చేసిన డబ్బును నిందితులు తమ స్వప్రయోజనాలకు వినియోగించుకున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై ఎవరైనా ప్రశ్నిస్తే తమ వద్ద భూదాన్ పట్టాలు ఉన్నాయని, హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయని చెప్పి బాధితులను నమ్మబలికినట్లు పోలీసులు తెలిపారు. ఇదే ముఠాపై గతంలో కూడా సుమారు 15 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
బాధితులకు ప్రభుత్వం అండ
వెలుగుమట్ల భూదాన్ భూముల విషయంలో ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. మోసపోయిన ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బును నిందితుల నుంచి రికవరీ చేసి తిరిగి బాధితులకు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భూదాన్ భూముల్లో అర్హులైన నిరుపేదలకు స్థలాలు కేటాయించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కేసులకు సంబంధించి ఖమ్మం ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్తో పాటు సత్తుపల్లి, కొణిజర్ల పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని, ఎవరైనా మోసపోయినట్లు ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో కొప్పెర వెంకన్న, కొట్టే బసు, సంపంగి వెంకటాచలం, బల్లి శ్రీనివాసరావు, తాళ్లూరి కృష్ణ, ముదిగ రాములు, మంకిడి లింగరాజు, రాచకొండ నరసింహాచారి, దండా లింగయ్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


