సెల్ టవర్ బ్యాటరీల దొంగల ముఠా అరెస్ట్
పోలీసుల అదుపులో ఐదుగురు అంతఃరాష్ట్ర నేరగాళ్లు
144 సెల్ టవర్ బ్యాటరీలు, రూ.2.60 లక్షల నగదు స్వాధీనం
మహారాష్ట్రలో విక్రయించి జల్సాలు : సీపీ సన్ప్రీత్ సింగ్
కాకతీయ, హనుమకొండ : అంతర్ రాష్ట్ర స్థాయిలో సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడిన ముఠాలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని హసన్పర్తి పోలీసులు ప్రత్యేక దర్యాప్తుతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన కొంపల్లి గణేష్, బొంగరాల సుధాకర్, తన్నీరు శివాజీ, బీమనబోయిన నరసింహ, గడగోజు సురేష్లను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.1.98 లక్షల విలువైన 144 సెల్ టవర్ బ్యాటరీలు, రూ.2.60 లక్షల నగదు, రెండు ట్రాలీలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్రలో విక్రయించి జల్సాలు
ప్రధాన నిందితుడు గణేష్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సుధాకర్, శివాజీకి సెల్ టవర్, జనరేటర్ పనులపై అవగాహన ఉంది. ఈ పరిజ్ఞానంతో ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చోరీ చేసిన బ్యాటరీలను మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో విక్రయించి డబ్బుతో జల్సాలు చేసేవారు. చెరువుల్లో చేపల చోరీలకు పాల్పడే వారితో కలిసి చోరీలకు అనుకూల ప్రాంతాలను గుర్తించేవారు. ఈ ముఠా వరంగల్ కమిషనరేట్తో పాటు యాదాద్రి, నల్గొండ, సూర్యపేట జిల్లాల్లో 13 చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు. అనంతసాగర్ ప్రాంతంలో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను గుర్తించారు. దేవన్నపేట అవుటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ వద్ద ఐదుగురిని అరెస్టు చేశారు. డీసీపీ దారా కవిత ఆధ్వర్యంలో కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ఇన్స్పెక్టర్ చేరాలు, ఎస్ ఐలు దేవేందర్, సుజిత్ రెడ్డి, కానిస్టేబుళ్లు క్రాంతి కుమార్, బావు సింగ్, వెంకట స్వామి, భరత్ తదితరులు పాల్గొన్నారు. వారి పనితీరును కమిషనర్ అభినందించారు.


