గణపతి లొంగుబాటు..!
అజ్ఞాత జీవితం వీడిన మావోయిస్టు అగ్రనేత
నలభై ఏళ్లకు పైగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర
పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి సీపీఐ మావోయిస్టు వరకు నాయకత్వం
దాదాపు 14 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
అనేక మారుపేర్లతో కార్యకలాపాలు సాగించిన గణపతి
ఆరోగ్య సమస్యలతో పదవి నుంచి తప్పుకున్న ముప్పాళ్ల లక్ష్మణరావు
ఇన్నాళ్లు నేపాల్లో తలదాచుకున్న ఉద్యమకారుడు
కాకతీయ, తెలంగాణ బ్యూరో / ఢిల్లీ : నలభై ఏళ్లకు పైగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఢిల్లీలో పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం వెలువడింది. దీర్ఘకాలంగా అజ్ఞాత జీవితం గడిపిన ఆయన బయటకు రావడం దేశవ్యాప్తంగా భద్రతా వర్గాల్లో చర్చకు దారితీసింది. గణపతి అసలు పేరు ముప్పాళ్ల లక్ష్మణరావు. తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన ఆయన దేశంలోని మావోయిస్టు ఉద్యమంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. గణపతి దాదాపు 40 ఏళ్లకు పైగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు. 1990 ప్రాంతంలో ఆయన పూర్తిగా అండర్గ్రౌండ్ జీవితాన్ని ప్రారంభించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్న పీపుల్స్ వార్ గ్రూప్ సంస్థలో చేరి కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. ఉద్యమంలో చేరిన తర్వాత క్రమంగా కీలక బాధ్యతలు చేపట్టి పార్టీ వ్యూహాలను రూపొందించే స్థాయికి ఎదిగారు.
ఉద్యమంలో కీలక వ్యూహకర్త
గణపతి కేవలం క్షేత్రస్థాయి నాయకుడే కాకుండా మావోయిస్టు ఉద్యమానికి ప్రధాన వ్యూహకర్తగా కూడా గుర్తింపు పొందారు. 1992లో కొండపల్లి సీతారామయ్య తర్వాత పీపుల్స్ వార్ గ్రూప్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో సంస్థ కార్యకలాపాలు దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరించాయి. 2004లో పీపుల్స్ వార్ గ్రూప్ మరియు మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ అనే రెండు ప్రధాన సంస్థలను విలీనం చేయడంలో గణపతి కీలక పాత్ర పోషించారు. ఈ విలీనంతో సీపీఐ మావోయిస్టు అనే కొత్త పార్టీ ఏర్పడింది. ఆ పార్టీకి ఆయన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2018 వరకు దాదాపు 14 సంవత్సరాలు పార్టీ అత్యున్నత నాయకుడిగా వ్యవహరించారు.
అనేక మారుపేర్లతో కార్యకలాపాలు
అజ్ఞాత జీవితం గడిపిన గణపతి అనేక మారుపేర్లతో కార్యకలాపాలు సాగించారు. గణపతి అనే పేరుతోనే ఎక్కువగా ప్రసిద్ధి చెందిన ఆయనను రాజన్న, శ్రీనివాస్, రాజిరెడ్డి, రాధాకృష్ణ, చంద్రశేఖర్, అజిత్ వంటి పేర్లతో కూడా పిలిచేవారు. ఈ మారుపేర్లతోనే దేశంలోని పలు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించినట్లు భద్రతా సంస్థలు చెబుతున్నాయి. గణపతి నాయకత్వంలో మావోయిస్టు ఉద్యమం ఒక దశలో దేశంలోని అనేక రాష్ట్రాలకు విస్తరించింది. ముఖ్యంగా దండకారణ్యం అటవీ ప్రాంతం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కార్యకలాపాలు బలంగా కొనసాగాయి. అయితే తరువాతి కాలంలో భద్రతా బలగాల చర్యలతో ఉద్యమం క్రమంగా బలహీనపడింది. గణపతి ప్రస్తుతం 76 ఏళ్ల వయస్సులో ఉన్నారు. వృద్ధాప్యంతో పాటు తీవ్రమైన కీళ్ల నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. నడవలేని స్థితి వరకు ఆరోగ్య సమస్యలు తీవ్రతరమైనట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణాలతోనే 2018లో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో నంబాల కేశవరావు బాధ్యతలు చేపట్టారు. తరువాత జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. గణపతి గత కొంతకాలంగా ఎక్కడ ఉన్నారన్నది స్పష్టంగా తెలియకపోయినా కొంతకాలం దండకారణ్యం ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. తరువాత నేపాల్లో లేదా ఇతర దేశాల్లో రహస్యంగా చికిత్స పొందుతున్నారనే వార్తలు వినిపించాయి. ఇటీవల ఆయన పట్టణ ప్రాంతంలో చికిత్స పొందుతున్నారని కూడా నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
బీర్పూర్ గ్రామ బిడ్డ..!
గణపతి తెలంగాణలోని జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బీర్పూర్ గ్రామానికి చెందినవారు. ఆయన తండ్రి ముప్పాళ్ల రామచంద్రరావు. చదువులో మెరుగైన ప్రతిభ కనబరిచిన గణపతి బీఎస్సీ, బీఎడ్ పూర్తి చేసి కరీంనగర్ ప్రాంతంలో సైన్స్ టీచర్గా పనిచేశారు. తరువాత ఉద్యమ ప్రభావంతో మావోయిస్టు కార్యకలాపాల్లో చేరినట్లు సమాచారం. ఆయన భార్య జోడ్ రత్నాబాయి కూడా మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు. ఇటీవల ఆమె లొంగిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. గణపతి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని లొంగిపోవాలని కుటుంబ సభ్యులు పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల గణపతి లొంగుబాటు వార్తలతో మావోయిస్టు ఉద్యమ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లు, అగ్రనేతల లొంగుబాట్లతో ఉద్యమం బలహీనపడిందని విశ్లేషకులు చెబుతున్నారు. గణపతి లొంగుబాటు నిజమైతే అది మావోయిస్టు ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.


