చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం..!
నరసింహులగూడెంలో చిన్నపిల్లలకు పరీక్షలు
కాకతీయ, కూసుమంచి : గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించాలనే ఉద్దేశంతో నరసింహులగూడెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కూసుమంచి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస చిన్నపిల్లల ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి గ్రామానికి చెందిన చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైద్యులు చిన్నపిల్లలను పరీక్షించి తల్లిదండ్రులకు ఆరోగ్యంపై సూచనలు ఇచ్చారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మండవ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు కూసుమంచి మండల కేంద్రంలో చిన్నపిల్లల ఆసుపత్రి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిన్నపిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం, పోషకాహార లోపం వంటి సమస్యలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని తల్లిదండ్రులకు సూచించారు. సమయానికి చికిత్స తీసుకుంటే పిల్లలు త్వరగా కోలుకుంటారని చెప్పారు. ప్రతి ఆదివారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామానికి వచ్చి సేవలు అందించిన వైద్యులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.


