చేవెళ్ల డిక్లరేషన్తో మోసం
ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు
ప్రగతిలేని పాలనలో 99 రోజుల ప్రణాళిక ఎందుకు?
పొంగులేటి రాజీనామా చేయాలి
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కాకతీయ, వరంగల్ బ్యూరో: చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్సీ, ఎస్టీలను మోసంచేసి ఇప్పుడు వారే సన్మానం చేయించుకోవడం సరైనది కాదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. శిల్పకళా వేదికలో ఎస్సీ ఉద్యోగుల చేత సన్మానం చేయించుకునే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకు చేసిన పనులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎస్సీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. చేవెళ్ల డిక్లరేషన్లో భాగంగా ఎస్సీలకు రూ.12 లక్షల ఆర్థిక సహాయం, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 18 శాతం వాటా వంటి హామీలు ఇచ్చినా వాటి అమలు ఎక్కడ ఉందో చెప్పాలని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
99 రోజుల ప్రగతి ప్రణాళికపై విమర్శలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నమని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ప్రగతి కనిపించకపోయినప్పుడు ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని అన్నారు. ప్రభుత్వ అధికారులు రోజూ చేసే పనులైన శానిటేషన్, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను కూడా 99 రోజుల ప్రణాళికలో చేర్చడం విచిత్రమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ద్వారా అధికారులను పాలకుల చుట్టూ తిరిగేలా చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి, రైతు బంధు, మన ఊరు–మన బడి, మిషన్ భగీరథ, దళిత బంధు వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరిందని చెప్పారు.
పొంగులేటి రాజీనామా చేయాలి
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర వనరులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించిన ప్రవీణ్ కుమార్, ఆయన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొత్వాల్ గూడ ప్రాంతంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరిట గుట్టలను ధ్వంసం చేసి కంకర సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ఇతర క్రషర్ యజమానులకు అనుమతులు ఇవ్వకుండా నోటీసులు జారీ చేస్తున్న అధికారులు, పొంగులేటికి సంబంధించిన కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పేర్లు తుడిచేసినంత మాత్రాన చేసిన దోపిడీ తుడిచి పెట్టలేరని అన్నారు. వెలుగుమట్లలో సుమారు 2 వేల పేద కుటుంబాల ఇళ్లను కూల్చివేసి వారిని రోడ్డుపైకి నెట్టేశారని ఆయన ఆరోపించారు. 4 వేల మంది పోలీసులతో ఆ ప్రాంతాన్ని గాజా లాగా మార్చారని విమర్శించారు. పేదలను పేయిడ్ బ్యాచ్, ల్యాండ్ మాఫియా అంటూ దూషించడం దురదృష్టకరమన్నారు. కాజీపేటలో ఏర్పాటు కానున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ కుడా చైర్మన్ యాదవ రెడ్డి, కార్పొరేటర్లు ఇమ్మడి రాజు, జన్ను జకర్య, గబ్బెట శ్రీను, మంద శ్యామ్, జంపన్న, చక్రి, సదాంత్, పూర్ణచందర్, ప్రశాంత్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


