భూదాన్ భూముల పేరిట మోసం
అక్రమ వసూళ్లపై 6 మందిపై కేసు
సత్తుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీహరి
కాకతీయ, సత్తుపల్లి : భూదాన్ భూముల పేరుతో నిరుపేదల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన 6 మందిపై కేసులు నమోదు చేసినట్లు సత్తుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీహరి తెలిపారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల ప్రాంతంలో ప్రభుత్వ భూములను ప్లాట్లుగా చూపిస్తూ డబ్బులు తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్కూర్ గ్రామానికి చెందిన పోనెబోయిన బేబీ, పోలెబోయిన ముత్తయ్య, కల్తి రామచంద్రయ్య, పడిగ యెర్రయ్య, షేక్ అక్తర్, కుంజా కృష్ణలు కలిసి భూదాన్ భూముల్లో ప్లాట్లు ఇస్తామని నమ్మబలికినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ భూములను అక్రమంగా కేటాయిస్తామని చెప్పి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడించారు. సత్తుపల్లి మండలం కిస్టారం గ్రామానికి చెందిన గుడిమల్ల స్పందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వెలుగుమట్లలోని సర్వే నంబర్లు 147, 148, 149 వద్ద భూమిని ప్లాట్లుగా ఇస్తామని చెప్పి 100 గజాల స్థలం కేటాయిస్తామని నమ్మబలికినట్లు తెలిపారు. తాము ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా భూములు పంపిణీ చేస్తామని, జిల్లా కలెక్టర్ ద్వారా పట్టాలు ఇప్పిస్తామని చెప్పి బాధితురాలిని మోసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నమ్మకంతో బాధితురాలు 45000 రూపాయలను ఫోన్ పే ద్వారా చెల్లించినట్లు ఫిర్యాదులో తెలిపిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు.


