మేడారంలో నలుగురి మృతి
ఆరుగురికి తీవ్ర గాయాలు
కాకతీయ, మేడారం బృందం : మేడారం జాతరలో గురువారం వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జాతర ప్రాంగణంలో అస్వస్థతకు గురైన భక్తులను ప్రధాన మెడికల్ క్యాంప్కు తరలించే క్రమంలో నలుగురు మృతి చెందినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం జగన్నగూడెం గ్రామానికి చెందిన సిద్ధగోని శంకర్ గౌడ్ (50) జనవరి 28న రాత్రి 8.40 గంటలకు మృతి చెందారు. మద్యం అతిగా సేవించడంతో హైదరాబాద్ అల్వాల్కు చెందిన పల్లెపు రాజు (40), మంచిర్యాల జిల్లా గోదావరిఖని గ్రామానికి చెందిన రవీందర్ సింగ్ టాగోర్ (41) మృతి చెందినట్లుగా అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లా ఐందారం గ్రామానికి చెందిన రేవల్లి సుగుణ (60) గురువారం జంపన్న వాగు నుంచి కుటుంబ సభ్యులతో వస్తుండగా.. చెత్త సేకరించే ట్రాక్టర్ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో సుగుణతో పాటు మరో ఆరుగురికి గాయాలయ్యాయి.



