ట్రాఫిక్ నియమాలు పాటించండి – సురక్షితంగా గమ్యం చేరండి
*వైరా ఏసీపీ
కాకతీయ, ఖమ్మం : ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలని వైరా ఏసీపీ సారంగపాణి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రాణనష్టాన్నినివారించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన మూడోవ విడత “అరైవ్ అలైవ్” ప్రత్యేక కార్యక్రమం చింతకాని మండలం పందిళ్లపల్లి గ్రామంలో సర్పంచులు, స్థానిక ప్రజలు, వాహన డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా పలు వాహన డ్రైవర్లకు అఖిల కంటి ఆసుపత్రి వైద్య బృందంతో కంటి చూపు పరీక్షలు నిర్వహించారు.
అనంతరం ఏసీపీ మాట్లాడుతూ..రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని ప్రజలకు సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలను, మరణాలను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రోడ్డు భద్రత ప్రాముఖ్యతను ప్రతి పౌరుడి మనసులో బలంగా నాటేందుకే అరైవ్ అలైవ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా ప్రజలకు సురక్షిత డ్రైవింగ్ సంస్కృతిని అలవాటు చేసి, రోడ్డు భద్రతా వ్యవస్థలను పటిష్ఠం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో రోడ్డు భద్రతలో ఆదర్శ జిల్లా గా తీర్చిదిద్దాలన్నది తమ ధ్యేయమని పేర్కొన్నారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, కార్లలో సీటు బెల్టులు పెట్టుకోకపోవడం, వాహనం నడుపుతూ సెల్ఫోన్ వాడడం, మద్యం సేవించి నడపడం, సిగ్నల్ జంప్, స్టాప్ లైన్ దాటడం, హైవేలపై ఆటోల ఓవర్ లోడింగ్, ఎడమవైపు నుంచి ఓవర్ టేకింగ్ వంటి ప్రమాదకర అలవాట్లపై ఈ ప్రచారంలో ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన తెలిపారు.


