పెండింగ్ కేసులపై ఫోకస్ పెట్టాలి
నేర సమీక్షలో సీపీ ఆదేశాలు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధ్యక్షతన కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులు తమ పరిధిలోని పెండింగ్ కేసుల పురోగతిని వివరించారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేయడం, శాంతిభద్రతల పరిరక్షణపై విస్తృతంగా చర్చ జరిగింది. 2024 వరకు పెండింగ్లో ఉన్న కేసులు, ఈ ఏడాది నమోదైన తీవ్ర నేరాల స్థితిగతులను సమీక్షించారు. ముఖ్యంగా ఆస్తి నేరాలు, మహిళలపై దాడులు, పోక్సో చట్టం కింద కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు.సైబర్ క్రైమ్ ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచాలని, సీఈఐఆర్ పోర్టల్ వినియోగాన్ని విస్తరించాలని సూచించారు. సీసీటీవీ కెమెరాల జియోట్యాగింగ్పై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
డ్రగ్స్, అక్రమ రవాణాపై కఠిన వైఖరి
ఎన్డీపీఎస్ చట్టం కింద మాదకద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని, ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్పై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన తనిఖీలు పెంచాలని, ట్రాఫిక్ నియంత్రణను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు.ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అదనపు డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వేణుగోపాల్, శ్రీనివాస్, విజయకుమార్, వెంకటస్వామి, మాధవి, యాదగిరిస్వామి, సతీష్తో పాటు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.


