హత్యాయత్నం ఘటనలో ఐదుగురు అరెస్టు
కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలోని నెహ్రూ బస్తి ప్రాంతంలో వ్యక్తిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఐదుగురు నిందితులను కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 4వ తేదీన నరేష్ కోరి (40) అనే వ్యక్తిపై రైలు పట్టాల సమీపంలో దాడి జరగగా, కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు శనివారం నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించినట్లు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. నెహ్రూ బస్తిలోని రైలు పట్టాల వద్ద ఉన్న కిరాణా దుకాణం దగ్గర నరేష్ తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో నాతరి శ్రీనాథ్, లోకేష్, శివ సంజయ్, వసుకుల ఉదయ్, నాతరి రాజేశ్వరరావు అలియాస్ ఐలయ్య కలిసి అతనిపై దాడి చేసినట్లు తెలిపారు. రోకలి బండతో నరేష్ తలపై గట్టిగా కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలినట్లు చెప్పారు. తలకు పలుచోట్ల గాయాలు కావడంతో నరేష్ స్పృహ కోల్పోయి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడని వెల్లడించారు.
ఇల్లు వివాదం కారణం
గాయపడిన నరేష్ను వెంటనే వైద్యం కోసం ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను అక్కడ చికిత్స పొందుతూ ఉండగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. నెహ్రూ బస్తి ప్రాంతానికి చెందిన నిర్మల అనే మహిళకు చెందిన రెండు అంతస్తుల భవనాన్ని ఐలయ్య కొన్ని నెలల క్రితం ఆక్రమించినట్లు పోలీసులు తెలిపారు. నిర్మల ఐలయ్య వద్ద నాలుగు లక్షల రూపాయలు అప్పుగా తీసుకుందని చెప్పారు. అనంతరం ఆమె అనారోగ్య కారణంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవడంతో, అప్పు డబ్బులు ఇవ్వకపోవడంతో ఐలయ్య గత పద్దెనిమిది నెలలుగా తన కుటుంబంతో అక్కడే ఉంటున్నట్లు వెల్లడించారు. ఇల్లు ఖాళీ చేయాలని నిర్మల కోరినా, అప్పు డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పుతూ ఐలయ్య ఇబ్బంది పెడుతున్నాడని తెలిపారు. ఈ విషయంలో నిర్మలకు నరేష్ మద్దతుగా నిలిచాడని, దాంతో అతనిపై కక్ష పెంచుకుని ఉద్దేశపూర్వకంగా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు నిందితులైన నాతరి శ్రీనాథ్, లోకేష్, శివ సంజయ్, వసుకుల ఉదయ్, నాతరి రాజేశ్వరరావు అలియాస్ ఐలయ్యలను అరెస్ట్ చేసి, వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు ఇన్స్పెక్టర్ కరుణాకర్ వివరించారు.


