మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ
ఉచిత బస్సు ప్రయాణంతో ఆదా పెరుగుదల
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, పరకాల : మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కలిగిందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడంలో ఈ పథకం కీలకంగా ఉందన్నారు. పరకాల బస్టాండ్ ఆవరణలో మహాలక్ష్మి పథకం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తోందన్నారు.
పరకాల బస్ డిపో పరిధిలోనే రెండు కోట్లకు పైగా మహిళలు ప్రయాణించి భారీగా ఆదా చేసుకున్నారని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఈ పథకం తోడ్పడుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


