కాంగ్రెస్–బీజేపీల వైఫల్యాలపై పోరాటం
కరీంనగర్ను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కే ప్రజలు పట్టం
అభ్యర్థులు దొరకని పార్టీలే విమర్శలు చేస్తున్నాయి
బీఆర్ఎస్ కరీంనగర్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధే నినాదంగా ప్రజల్లోకి వెళ్తామని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీల పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకక రెండు పార్టీల నేతలు అయోమయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. గెలిచే సత్తా ఉన్న నాయకులు లేక బీఆర్ఎస్ కార్యకర్తలకు కండువాలు కప్పి తమ పార్టీల్లో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. డివిజన్ల వెంట కండువాలు పట్టుకుని తిరిగినా ప్రజల నుంచి ఆదరణ లభించడం లేదన్నారు.
కండువా మార్చగానే గతం మర్చిపోయారా?
మాజీ మేయర్ సునీల్ రావుపై తీవ్ర విమర్శలు చేసిన హరిశంకర్.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ఇప్పుడు బీజేపీ చేసిందని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. కండువా మార్చగానే గతాన్ని మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు. రెండేళ్లుగా నగరానికి నిధులు తీసుకురాని కాంగ్రెస్ నేతలు ఎన్నికల వేళ కొబ్బరికాయలు కొడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ నగరానికి చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
గంగుల–వినోద్ కృషితోనే నగర సుందరీకరణ
మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కృషితోనే కరీంనగర్ నగరం సుందరంగా మారిందని హరిశంకర్ గుర్తుచేశారు. డంప్యార్డు తరలింపు వంటి ప్రధాన సమస్యలపై ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలను కూడా ఎత్తిచూపుతూ, కరీంనగర్ ప్రజలు విజ్ఞులని, అభివృద్ధికి పట్టం కడుతూ బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేష్, కచ్చు రవి, నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు షౌకత్, యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, బొంకూరి మోహన్, ఆరె రవి గౌడ్, తొంటి రాజేందర్, ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, జల్లోజి శ్రీనివాస్, సతినేని శ్రీనివాస్, నాగుల కిరణ్ కుమార్ గౌడ్, పూరెల్ల సరోజ, ఒడ్నాల రాజు, సుంకిశాల సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.


